దోమలు కొందరినే ఎందుకు కుడుతాయో తెలుసా..? వాటి ప్లానింగ్ తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేసే దోమలు.. తమ లక్ష్యాన్ని ఎలా ఎంచుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? రీసెంట్గా జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్లో దోమల మైండ్ గేమ్ బయటపడింది. అవి మన శ్వాసను, శరీర వాసనను మాత్రమే కాదు.. మనం వేసుకునే బట్టల రంగును కూడా గమనిస్తాయట.. అసలు దోమల నుండి తప్పించుకోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మన చుట్టూ వందల మంది ఉన్నా, దోమలు వచ్చి మనల్నే కుడుతున్నాయా? నా రక్తం తీపి అందుకే కుడుతున్నాయి అని మనం సరదాగా అనుకుంటాం కానీ.. దీని వెనుక ఒక పెద్ద సైన్స్ దాగి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు. దోమలు యాదృచ్ఛికంగా ఎవరినో ఒకరిని ఎంచుకోవు.. అవి ఒక వ్యూహం ప్రకారం.. కొన్ని సంకేతాలను విశ్లేషించి మరీ మనుషులపై దాడి చేస్తాయని సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
దోమలు చిన్న రోబోల లాంటివి..
ఈ పరిశోధనలో వందలాది దోమలను ట్రాక్ చేసి, లక్షలాది డేటా పాయింట్లను విశ్లేషించారు. దోమలు ఒకదానిని ఒకటి అనుసరించవు. ప్రతి దోమ తన సొంత నిర్ణయం తీసుకుంటుంది. శాస్త్రవేత్తలు దీనిని ఒక ఒక రద్దీగా ఉండే బార్తో పోల్చారు.. ఒక ప్రదేశంలో వాతావరణం బాగుంటే ప్రజలందరూ అక్కడికి ఎలాగైతే చేరుకుంటారో.. అలాగే ఒకే రకమైన సిగ్నల్స్ ఇచ్చే మనుషుల వైపు దోమలన్నీ ఆకర్షించబడతాయి.
మిమ్మల్ని దోమలకు పట్టించే ఆ 3 సంకేతాలు ఇవే
దోమలు ప్రధానంగా మూడు అంశాల ఆధారంగా తమ లక్ష్యాన్ని ఎంచుకుంటాయని 3D ఇన్ఫ్రారెడ్ కెమెరాల ద్వారా చేసిన పరిశోధనలో తేలింది..
కార్బన్ డయాక్సైడ్: మనం వదిలే శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్ దోమలకు ప్రధాన దిక్సూచి. మనం వదిలే శ్వాసలోని కార్బన్ డయాక్సైడ్ వాసనను దోమలు చాలా దూరం నుండే పసిగడతాయి. మనం ఎంత ఎక్కువగా శ్వాస వదిలితే, అంత త్వరగా దోమలు మనల్ని చేరుకుంటాయి.
శరీర దుర్వాసన: మన శరీరం నుండి వచ్చే చెమట, ఇతర వాసనలు దోమలను ఆకర్షిస్తాయి.
దుస్తుల రంగు: మనం వేసుకునే బట్టల రంగు కూడా దోమల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ముదురు రంగులు దోమలను త్వరగా ఆకర్షిస్తాయని గుర్తించారు.
ఆడ దోమలే డేంజర్
ఈ పరిశోధనలో ముఖ్యంగా ఆడ ఈడిస్ ఈజిప్టి దోమల ప్రవర్తనను గమనించారు. ఇవి డెంగ్యూ, పసుపు జ్వరాన్ని వ్యాపింపజేస్తాయి. ఆడ దోమలకు గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రోటీన్ కోసం రక్తం అవసరం. అందుకే అవి ఈ మూడు సంకేతాలను మిళితం చేసి తమ ఎరను వ్యూహాత్మకంగా ఎంచుకుంటాయి.
ఈ పరిశోధన ఎందుకు ముఖ్యం?
దోమల వల్ల కలిగే మలేరియా, జికా వైరస్, పసుపు జ్వరం వంటి వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. దోమలు మనుషులను ఎలా గుర్తిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా.. భవిష్యత్తులో మెరుగైన దోమల నివారణ మందులను తయారు చేయవచ్చు. వ్యాధుల వ్యాప్తిని అరికట్టే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చు.
దోమలు కేవలం రక్తం కోసం వచ్చే కీటకాలు మాత్రమే కాదు, అవి అత్యంత తెలివైన గ్రహణ సామర్థ్యం కలిగిన వ్యూహకర్తలు. కాబట్టి దోమల బారిన పడకుండా ఉండాలంటే కేవలం అదృష్టం మీద కాకుండా అప్రమత్తతపై ఆధారపడటం మంచిది.
