AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతన్నలు పంట పూర్తయ్యాక ఇలా చేస్తున్నారా..? భూమిని చేతులారా నాశనం చేసుకున్నట్లే..

పొలాల్లో వరి గడ్డి, పత్తి చెత్త, మొక్కజొన్న కాడలకు నిప్పు పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరంగా మారుతోంది. ఈ మంటల వల్ల రైతులు ప్రాణాలు కోల్పోవడంతో పాటు రోడ్డు ప్రమాదాలు, కాలుష్యం, భూమి సార నష్టం పెరుగుతున్నాయి. నిప్పు పెట్టడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి, దిగుబడి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట అవశేషాలను భూమిలో కలిపితే సహజ ఎరువుగా మారి, నేల బలపడటంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

రైతన్నలు పంట పూర్తయ్యాక ఇలా చేస్తున్నారా..? భూమిని చేతులారా నాశనం చేసుకున్నట్లే..
Soil Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2026 | 1:50 PM

Share

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు సైలెంట్ కిల్లర్‌గా మారిందీ వరి కొయ్యల మంటలు.. పొలాన్ని త్వరగా శుభ్రం చేసుకోవడానికి రైతులు గీస్తున్న ఒకే ఒక్క అగ్గిపుల్ల.. వారినే చితి మంటల్లోకి నెట్టేస్తోంది. దీంతో వారి ప్రాణాలు ప్రమాదంలో పడటంతోపాటు.. వేరే ప్రాణాలు కూడా పోతున్నాయి.. అంతేకాకుండా వారి పొలంలో అంటుకున్న మంటలు వేరే పొలాలకు కూడా వ్యాపించి.. బుగ్గిచేస్తున్నాయి.. ఇలాంటి ఘటనల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా సంఖ్యలో రైతులు మరణించారు. అంతేకాకుండా యాక్సిడెంట్‌లు సైతం అవుతున్నాయి.. ఇటీవల భర్తను కాపాడబోయి భార్య, పక్క పొలాన్ని కాపాడబోయి రైతు, ఆ పొగకు ఊపిరాడక ఒకరు, అదే పొగ కారణంగా రోడ్ యాక్సిడెంట్ అయి ఇద్దరు.. చెట్లు పడి.. ఇలా ఒకరి వెనుక ఒకరు ప్రాణాలు కోల్పోవడంతోపాటు.. ఎంతో మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. అన్నిటికీ కారణం వరి కొయ్యలను కాల్చడం, ఎండిన మిరప, పత్తి, గడ్డికి నిప్పు పెట్టడం..

పంట కోతల తర్వాత పొలాల్లో మిగిలిపోయే వరి గడ్డి, మొక్కజొన్న కాడలు, పత్తి చెత్త వంటి పంట అవశేషాలను చాలా మంది రైతులు పనికిరావని భావించి, త్వరగా పొలం శుభ్రం అవుతుందని మంట పెట్టి కాల్చేస్తున్నారు. కానీ నిజానికి, ఈ చర్య వల్ల భూమి బలాన్ని మనమే కాల్చేస్తున్నాం. గడ్డి కాల్చడం వల్ల భూమిలో నివసించే మంచి సూక్ష్మజీవులు, ఎర్ర పురుగులు, నేలను సారవంతంగా ఉంచే సహజ శక్తి నశించిపోతుంది. ఒకసారి కాల్చగానే పెద్ద తేడా కనిపించకపోయినా, ప్రతి సంవత్సరం ఇలా చేయడం వల్ల భూమి క్రమంగా బలహీనపడిపోతుంది. తదనంతర కాలంలో అధిక ఎరువులు వాడినా కూడా, పంట పూర్వంలా దిగుబడిని ఇవ్వదు.

గడ్డిని కాల్చినప్పుడు, భూమికి అత్యవసరమైన పోషకాలు పొగతో పాటు గాలిలో కలిసిపోతాయి. దీనివల్ల రైతు మరింత ఖర్చుపెట్టి బయటి నుండి రసాయన ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా, నేల త్వరగా ఎండిపోతుంది, నీటిపారుదల కోసం అధిక నీరు అవసరమవుతుంది, బోర్ నీళ్ల వినియోగం పెరుగుతుంది. ఈ పొగ వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి, చిన్న పిల్లలు, పెద్దవాళ్లకు ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. రోడ్లపై పొగ కమ్ముకుని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే, పంట అవశేషాలను కాల్చడం వల్ల రైతుకు మాత్రమే కాకుండా, భూమికి, మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది.

పంట అవశేషాలతో ఎంతో ప్రయోజనం..

అయితే, ఈ పంట అవశేషాలనే భూమిలో కలియదున్నడం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గడ్డి కుళ్ళిపోయి, భూమికి అత్యంత అవసరమైన సహజ ఎరువుగా మారుతుంది. దీనివల్ల భూమి మెత్తగా మారి, నేలలో తేమ ఎక్కువ రోజులు నిలిచి ఉంటుంది. సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, అవి భూమికి మేలు చేస్తాయి. ఫలితంగా, పంట బలంగా పెరుగుతుంది. క్రమంగా ఎరువుల ఖర్చు తగ్గిపోతుంది. భూమి తిరిగి సజీవంగా మారుతుంది. రెండు, మూడు పంటల తర్వాత దిగుబడిలో కూడా గణనీయమైన మార్పు, పెరుగుదల కనిపిస్తుంది. అందుకే, గడ్డి చెత్త కాదు, అది భూమికి ఒక బంగారం వంటిది.

ఈ గడ్డిని భూమిలో సమర్థవంతంగా కలపడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ముందుగా, పంట అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనికి దున్నే యంత్రాలను ఉపయోగించడం సులభమైన పద్ధతి. తర్వాత, పొలానికి కొద్దిగా నీరు పెట్టాలి. తడి ఉన్న నేలలో గడ్డి త్వరగా కుళ్ళుతుంది. ఆ తర్వాత, పశువుల పేడతో తయారు చేసిన ద్రావణం లేదా జీవపదార్థాలు కలిపిన డీకంపోజర్ ద్రావణాన్ని చల్లితే గడ్డి మరింత వేగంగా కుళ్ళుతుంది. అనంతరం, ఈ అవశేషాలు భూమిలో బాగా కలిసేలా దున్నాలి. ఇలా చేసిన తర్వాత 15 నుండి 20 రోజుల వరకు పొలాన్ని వదిలేస్తే, గడ్డి పూర్తిగా కుళ్ళి ఉత్తమమైన ఎరువుగా మారిపోతుంది.

వివిధ పంటలకు అవశేషాలను కలిపే పద్ధతులు కొద్దిగా మారుతాయి. వరి పంటలో గడ్డి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దానిని బాగా చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలపాలి. మొక్కజొన్న కాడలు గట్టిగా ఉంటాయి కాబట్టి, వాటిని మరింతగా నూరి భూమిలో కలపడం మంచిది. పత్తి కాడలలో కొన్ని రోగాలు ఉండే అవకాశం ఉన్నందున, వాటిని కుళ్ళించే ద్రావణాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. కూరగాయల పంటల్లో అయితే, గడ్డిని పైపైనే ఉంచినా, నేల తేమను కాపాడటానికి ఉపయోగపడుతుంది. నేడు మనం పంట అవశేషాలను కాల్చేస్తే, రేపటి భూమి బలాన్ని మనమే తగ్గించినట్టే. అదే గడ్డిని భూమిలో కలిపితే, అది మన పంటకు శక్తిగా మారి, అధిక దిగుబడులతో పాటు ఖర్చులను కూడా తగ్గిస్తుంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us