181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. ఇంతకీ అతడెవరు.. ఎందుకంటే?

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 181 ఏళ్లకు పైగా ఓ వ్యక్తి తలను ఓ మ్యూజియంలో భద్రపరిచారు. అదేంటి.! అంతకాలం

181 ఏళ్లుగా సీసాలో భద్రపరిచిన ఓ వ్యక్తి తల.. ఇంతకీ అతడెవరు.. ఎందుకంటే?
Serial Killer Skull
Follow us

|

Updated on: Oct 08, 2022 | 1:42 PM

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 181 ఏళ్లకు పైగా ఓ వ్యక్తి తలను ఓ మ్యూజియంలో భద్రపరిచారు. అదేంటి.! అంతకాలం ఎందుకు దాచిపెట్టారని మీరు అనుకోవచ్చు.? అతడు ఏమైనా లెజెండా.? లేక ఏ దేశానికైనా అధ్యక్షుడా.? అని ఆలోచిస్తుంటే.. మీరు తప్పులో కాలేసినట్లే.. అతడు గొప్ప వ్యక్తి కాదు.. ఓ కిరాతకుడు.. కోల్డ్ బ్లడెడ్ మర్డరర్.. అమాయకులని చూడకుండా.. ఏమాత్రం కనికరం లేకుండా 70 మందికి పైగా ప్రజలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ డియాగో ఎల్విన్.

వివరాల్లోకి వెళ్తే.. 1819లో స్పెయిన్‌లో జన్మించిన డియాగో.. ఉద్యోగ వేట నిమిత్తం 25 ఏళ్ళకు పోర్చుగల్‌లోని లిస్బన్‌కు చేరుకున్నాడు. ఎంత వెతికినా అతడికి ఎలాంటి ఉద్యోగం దొరక్కపోవడంతో.. చిన్న చిన్న నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉండే దొంగల ముఠాలతో చేరి దారి దోపిడీలకు పాల్పడేవాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాగా గడిపేవాడు. అయితే.. డియాగోకు ఈ డబ్బు కూడా సరిపోలేదు. మరింత సొమ్ము సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. రైతులనే టార్గెట్‌గా చేసుకుని.. వారి కోసం రాత్రుళ్లు ఓ బ్రిడ్జి దగ్గర కాపు కాసేవాడు. ఒంటరిగా అటువైపు ఎవరొచ్చిన వారిని దోచుకుని.. ఆ తర్వాత చంపేసి.. శవాలను బ్రిడ్జిపై నుంచి నీళ్ళల్లోకి పడేసేవాడు. ఇలా సుమారు 70 మందిని పొట్టన పెట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే.. మొదట్లో బ్రిడ్జి కింద దొరికిన మృతదేహాలు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుకున్నారు. కాని ఆ సంఖ్య పెరుగుతూపోవడంతో వారికి అనుమానం వచ్చింది. ఎంక్వైరీ మొదలుపెట్టగా.. చనిపోయిన వారిలో కొందరు ధనిక రైతులు ఉన్నారని తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే బ్రిడ్జి దగ్గర భద్రత పెంచారు. ఇది తెలుసుకున్న డియాగో తన ప్లాన్ మార్చుకున్నాడు. లిస్బన్ నగరంలోని ధనికుల ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని తన ముఠాతో దోపీడీలు, హత్యలు చేసేవాడు. అయితే అనూహ్యంగా ఓ డాక్టర్ ఇంట్లో డియాగో తన ముఠాతో దోపిడీకి పాల్పడి.. ఆ తర్వాత ఇంట్లోవారిని చంపేసి పారిపోతుండగా.. పోలీసులకు దొరికిపోయాడు.

తమకు దొరికిన డియాగోకు పోలీసులు థర్డ్ డిగ్రీ పెట్టి.. విచారించారు. దీంతో మొత్తం విషయాలన్నీ బయటపడ్డాయి. సుమారు 70కి పైగా హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇక పోర్చుగల్ కోర్టు 1841లో డియాగోకు మరణ శిక్ష విధించింది. అయితే అప్పుడే కొందరు వైద్యులు.. సీరియల్ కిల్లర్స్ ఎలా ఆలోచిస్తారన్న దానిపై పరిశోధనలు చేస్తామని.. అందుకు డియాగో తల కావాలని కోరారు. దీనికి కోర్టు, అక్కడి ప్రభుత్వం అనుమతించడంతో.. అప్పటి నుంచి సుమారు 181 ఏళ్లు డియాగో తలను కెమికల్స్ నిండిన ఓ సీసాలో జాగ్రత్తగా భద్రపరిచారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..