వర్షాకాలం అంటేనే వ్యాధులకు నిలయం. ఈ కాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో డెంగ్యూ విజృంభిస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు రోగి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్లేట్లెట్స్ 50 వేల కంటే తక్కువగా ఉంటే రోగి ప్రాణాలకే ప్రమాదం. కానీ ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే డెంగ్యూ మాత్రమే కాదు, మరొక వ్యాధి కూడా వస్తుంది. ఈ వ్యాధిని ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా పర్పురా అంటారు. ఈ బ్లడ్ డిజార్డర్ ప్లేట్లెట్స్ సంఖ్యను వేగంగా తగ్గిస్తుంది. ఈ వ్యాధికి గల కారణాలు ఇప్పటి వరకు పరిశోధకులు కనుగొనలేకపోయారు. అయితే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థలో ఏదో లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇమ్యునో థ్రోంబోసైటోపెనియా వ్యాధి సోకితే.. శరీరం స్వంత రోగనిరోధక వ్యవస్థ ప్లేట్లెట్లను దెబ్బతీయడం ప్రారంభిస్తుందని ముంబైలోని జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లోని సీనియర్ డాక్టర్ చెప్పారు. ఫలితంగా శరీరంలో ప్లేట్లెట్స్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. CBC, PS పరీక్షల సహాయంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత ఈ వ్యాధి శరీరంలో అభివృద్ధి చెందుతుంది.
ఒక వ్యక్తికి డెంగ్యూ లేకున్నా.. రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ 1,00,000 కంటే తక్కువగా ఉండి, అది క్రమంగా తగ్గుతూ ఉంటే ఇమ్యునో థ్రోంబోసైటోపెనియాకు సంకేతం కావచ్చు. ఈ వ్యాధి చాలా అరుదుగా వస్తుంది. సీబీసీ రక్త పరీక్ష ద్వారా ప్లేట్లెట్ కౌంట్ 1,00,000 కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. ఈ వ్యాధిని మందుల ద్వారా సులభంగా నియంత్రించవచ్చు.
ఈ వ్యాధి రోగనిరోధక వ్యవస్థకు ఆటంకం కలిగించడం వల్ల వస్తుంది. దీనిని నివారించడానికి ప్రత్యేక చికిత్స లేనప్పటికీ, ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చు. శరీరంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న సంకేతాలు కనిపిస్తే రక్త పరీక్ష చేయించుకుని వైద్యుడిని సంప్రదించాలి.