AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Fever: ఈ 3 జబ్బులు ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రాణ గండమే.. వైద్యుల హెచ్చరిక!

వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు పెరుగుతుంది. సాధారణంగా ఇది నయమయ్యే వ్యాధి అయినప్పటికీ, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి డెంగ్యూ సోకితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. వీరిలో అంతర్గత రక్తస్రావం, ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని, కాబట్టే లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dengue Fever: ఈ 3 జబ్బులు ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రాణ గండమే.. వైద్యుల హెచ్చరిక!
Dengue Fever Health Warning,
Bhavani
|

Updated on: Jun 22, 2026 | 1:11 PM

Share

దేశవ్యాప్తంగా వర్షాలు మొదలుకావడంతో డెంగ్యూ జ్వరాల ముప్పు మళ్లీ పెరుగుతోంది. సాధారణంగా డెంగ్యూ జ్వరం వస్తే సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా సులభంగానే నయమవుతుంది. కానీ, అప్పటికే కొన్ని రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం డెంగ్యూ సోకితే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం (షుగర్), అధిక రక్తపోటు (బీపీ) వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు , ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డెంగ్యూ వైరస్‌ను వ్యాప్తి చేసే ‘ఈడిస్’ దోమలు సాధారణంగా తెల్లవారుజామున , సాయంత్రం వేళల్లో ఎక్కువగా కుడుతుంటాయి. ఈ జ్వరం వచ్చినప్పుడు ప్రారంభంలో శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏయే పరిస్థితుల్లో ప్రమాదం రెట్టింపు అవుతుందంటే..

డెంగ్యూ ముఖ్య లక్షణాలు

డెంగ్యూ సోకిన ప్రారంభ దశలో రోగికి 104 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు విపరీతమైన జ్వరం రావచ్చు.

తీవ్రమైన తలనొప్పి , కళ్ల వెనుక నొప్పి రావడం

కండరాలు , కీళ్లలో భరించలేని విధంగా నొప్పులు పుట్టడం

వికారం, వాంతులు , శరీరం నిస్సత్తువగా మారడం

చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపించడం

గ్రంథుల వాపు రావడం

పరిస్థితి చేయి దాటితే శరీరంలో ప్లాస్మా లీకేజ్ అవ్వడం, అంతర్గత రక్తస్రావం కావడం, రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి షాక్‌కు గురికావడం , అంతర్గత అవయవాలు వైఫల్యం చెందడం వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి.

వీరికి ముప్పే..

మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు: షుగర్ వ్యాధి ఉన్న రోగులలో డెంగ్యూ జ్వరం చాలా వేగంగా ముదురుతుంది. ఒకవేళ మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా ఉంటే, సాధారణ వారితో పోలిస్తే వీరిలో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఏకంగా 8 రెట్లు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారు: బీపీ ఉన్న రోగులకు డెంగ్యూ సోకితే తీవ్రమైన లక్షణాలు వచ్చే అవకాశం 1.5 నుండి 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు వల్ల వీరి రక్తనాళాలు ఇప్పటికే బలహీనంగా మారి ఉంటాయి. దీనివల్ల డెంగ్యూ కారణంగా వచ్చే వాపును, ప్లాస్మా లీకేజీని తట్టుకునే శక్తి గుండెకు తగ్గుతుంది. ఫలితంగా వీరికి ఐసీయూ (ICU) చికిత్స అవసరమయ్యే అవకాశాలు ఎక్కువ.

ఊబకాయం (అధిక బరువు) ఉన్నవారు: అధిక బరువు లేదా ఊబకాయం అనేది మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనివల్ల డెంగ్యూ ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యం శరీరానికి తగ్గిపోతుంది.

కిడ్నీ వ్యాధులు ఉన్నవారు: దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ఉన్న రోగులకు డెంగ్యూ సోకితే వారు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తుంది. వీరిలో మరణ గండం సాధారణం కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే కిడ్నీల పనితీరు మందగించడం వల్ల శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతిని అవయవాలు త్వరగా వైఫల్యం చెందుతాయి.

అందువల్ల అప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ జ్వరం వచ్చినట్లు అనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించడం ఎంతో సురక్షితం.

గమనిక (Disclaimer): ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం సాధారణ అవగాహన , వైద్య నిపుణుల హెచ్చరికల ఆధారంగా సేకరించింది మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. జ్వరం, ఒంటి నొప్పులు వంటి డెంగ్యూ లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Follow Us