Paruchuri Raghubabu: హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు? పాపం చిన్న వయసులోనే..
పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమ పదునైన కలంతో మెగాస్టార్ చిరంజీవితో సహా ఎంతో మంది స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చారీ సీనియర్ రైటర్స్. అలాంటి రైటర్స్ తమ కుటుంబంలోనూ ఓ వారసుడిని హీరో చేయాలనుకున్నారు. కానీ పాపం..

పరుచూరి బ్రదర్స్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితల స్థాయిని పెంచిన వారిలో వీరు మొదటి స్థానంలో ఉంటారు. ఇప్పుడంటే సినిమాలు చేయడం లేదు కానీ ఒకప్పుడు వీరికి హీరోలకు మించిన క్రేజ్, పాపులారిటీ ఉండేది. అంతేకాదు హీరోలు, హీరోయిన్లకు మించిన పారితోషికం అందుకున్న ఘనత కూడా ఈ సీనియర్ రైటర్స్ సొంతం. సుమారు 300 సినిమాలకు పైగానే రైటర్స్గా పని చేసిన పరుచూరి బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు. ఓ వైపు వెంకటేశ్వరరావు.. మరోవైపు గోపాల కృష్ణ ఇద్దరూ ఎవరికి వాళ్లే తమదైన శైలిలో కథలు రాస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ రచయితలుగా తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం రైటర్స్గానే కాకుండా నటులుగానూ సత్తా చూపించారీ బ్రదర్స్. మరీ ముఖ్యంగా వీరిలో పెద్ద వాడైన పరుచూరి వెంకటేశ్వరరావు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. సహాయక నటుడిగా మెప్పించారు.
చిరంజీవి నుంచి నేటి చిన్న హీరోల వరకు ఎంతో మందికి తమ కథలతో జీవితాన్ని అందించారు పరిచూరి బ్రదర్స్. అలాంటి రైటర్స్ తమ కుటుంబంలో నుంచి కూడా ఒకరిని హీరోగా చేయాలనుకున్నారట. పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘు బాబు ను వెండితెరకు పరిచయం చేయాలనుకుని ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ప్రేమఖైదీ అనే కథ రాసి అందులో తన కుమారుడిని నటించజేయాలనుకున్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఈ సినిమాను నిర్మించడానికి దిగ్గజ నిర్మాత ది గ్రేట్ మూవీ మొఘల్ రామానాయుడు కూడా రెడీ అయ్యారట. ఈ సినిమా కోసం దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణ ను ఎంపిక చేసుకున్నారు. అయితే సినిమాల్లో నటించేందుకు కాస్త అనుభవం కోసం రఘుబాబు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఓ నాటకం వేశారట. ఆ నాటకం మధ్యలోనే అతను రక్తం కక్కుకుని కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారట. రఘుబాగు క్రమంగా కోలుకున్నప్పటికీ ఆ తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారిందట. దీంతో చిన్న వయసులోనే రఘు బాబు కన్నుమూశారట.
కాగా పరుచూరి రఘుబాబు చనిపోయి సుమారు 36 ఏళ్లకు పైగానే అవుతోంది. అందుకే ఈ తరం వాళ్లకు అసలు పరుచూరికి కొడుకు ఉన్నాడని.. ఆయన మరణించాడని కూడా తెలియదు. అయితే తమ కుమారుడి స్మారకార్థం అతని పేరు మీద ఒక మెమోరియల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు పరిచూరి బ్రదర్స్. ఏటా వారం రోజుల పాటు నాటకాలు నిర్వహించి, అందులో ప్రతిభ చూపించిన వాళ్లకు అవార్డులు ఇస్తున్నారు. అంతేకాదు తన కొడుకు రఘుబాబు పేరు మీద ఓ నాటక మండలిని కూడా స్థాపించారు పరుచూరి వెంకటేశ్వరరావు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




