ప్రముఖ సినీనటుడు శరత్కుమార్ ఆదివారం (డిసెంబర్11)న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. డయేరియా, డీహైడ్రేషన్ కారణంగా శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, అందుకే అత్యవసరంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారని వార్తలు వచ్చాయి. సోషల్మీడియాలోనూ శరత్కుమార్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేశాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఈ వార్తలపై శరత్కుమార్ పీఆర్ టీం స్పందించింది. ఆయన హెల్త్ కండీషన్పై అప్డేట్ ఇచ్చింది. శరత్కుమార్ చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం మాత్రమే ఆస్పత్రికి వెళ్లారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని పేర్కొంది.వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో చెన్నైలోని నివాసానికి చేరుకున్నారని, అభిమానులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం విజ్ఞప్తి చేసింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు శరత్కుమార్. ప్రస్తుతం సినిమాలతో పాటు పరంపరా లాంటి వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాలో సందడి చేసిన విజయ్ ప్రస్తుతం విజయ్ వారసుడు చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీలో కూడా కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక సినిమాలతో పాటు ఆల్ ఇండియా సమతువా మక్కళ్ కచ్చి పార్టీని స్థాపించి రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా ఉంటున్నారీ సీనియర్ నటుడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..