Music Director : పూరి జగన్నాథ్ పరిచయం.. నా లైఫ్కు టర్నింగ్ పాయింట్.. మ్యూజిక్ డైరెక్టర్..
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా పూరి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ గురించి తెలిసిందే. అందుకే పూరి సినిమాలంటే కుర్రాళ్లు తెగ ఇష్టపడుతుంటారు. అయితే కొన్నాళ్లుగా పూరి తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవడం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రఘు కుంచె. కానీ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఆయన సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు మారిన తర్వాత కూడా సంగీత పరిశ్రమ మాత్రం చెన్నై కేంద్రంగానే కొనసాగిందని రఘు కుంచె తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో అవకాశాల కోసం వెళ్లాల్సి రావడం, స్థానిక కళాకారులకు తక్కువ ప్రాధాన్యత లభించడం వంటి సవాళ్లను ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో జెమినీ టెలివిజన్ ప్రారంభం ఆయనకు కొత్త ద్వారాలు తెరిచింది. జీకే మోహన్ పరిచయంతో “యువర్స్ లవింగ్లీ” కార్యక్రమానికి యాంకర్గా మారిన రఘు, దాదాపు పదేళ్ల పాటు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ సమయంలో ఎక్కువ మంది మహిళా యాంకర్లు ఉండగా, రఘు ఒక మేల్ యాంకర్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. కెమెరామెన్ సుధాకర్, మధు పర్చా, శ్రీధర్ వంటి సాంకేతిక నిపుణుల సహకారంతో ఆయన ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పారు.
“యువర్స్ లవింగ్లీ” కార్యక్రమానికే సంగీత దర్శకుడిగా తన మొదటి పాటను కంపోజ్ చేసిన రఘు, దానిని చంద్రబోస్ గారు రచించారని తెలిపారు. “క్షేమమా స్నేహం” పల్లవితో సాగే ఆ పాట అప్పట్లో ఎంతో మందిని అలరించిందని, ఇప్పటికీ చాలా మంది ఆ పాటను గుర్తుంచుకోవడం తన కెరీర్కు ఎంతో తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు.
ఈ దశలో పూరి జగన్నాధ్తో రఘు కుంచెకు పరిచయం ఏర్పడింది. జెమినీ టీవీలోకి రాకముందే పూరితో ఈ పరిచయం జరిగిందని, ఇది తన జీవితంలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అని రఘు స్పష్టం చేశారు. పూరి జగన్నాధ్ అప్పుడు దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఒక స్ట్రగ్లర్ అని, శ్రీకాంత్, ఆహుతి ప్రసాద్, శివాజీ రాజా వంటివారితో కలిసి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి బృందంలో ఒకరని రఘు తెలిపారు. కొన్నాళ్లు తామిద్దరం రూమ్మేట్స్గా కూడా ఉన్నామని, ఆ తర్వాత పూరికి “బద్రి” సినిమా, ఆపై “బాచి” చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చిందని చెప్పారు. “బాచి” సినిమాలో “లక్ష్మి లక్ష్మి” పాటతో పూరి జగన్నాధ్ తనకు ప్లేబ్యాక్ సింగర్గా మొదటి అవకాశం ఇచ్చారని, చక్రి ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేశారని రఘు పేర్కొన్నారు. “బాచి” సినిమా ఫ్లాప్ అయినా, “లక్ష్మి లక్ష్మి” పాట మాత్రం పెద్ద హిట్ అయిందని, ఈ పాట తర్వాతే చిరంజీవి “మృగరాజు” సినిమాలో పాడే అవకాశం తనకు లభించిందని రఘు కుంచె వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..
ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?
