Chiranjeevi: వరద బాధితులకు అండగా మెగాస్టార్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి

|

Sep 04, 2024 | 11:39 AM

వరదల్లో పడుతున్న పాట్లు అన్నీ ఇన్నికావు. మూడ్రోజుల తర్వాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో.. కొందరు కాలినడకన బయటకు వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక.. ఎవరికి తోచిన విధంగా వారు వరద నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Chiranjeevi: వరద బాధితులకు అండగా మెగాస్టార్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన చిరంజీవి
Chiranjeevi
Follow us on

విజయవాడ వరదల్లో కనిపిస్తున్న దృశ్యాలు.. కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. అప్పుడే పుట్టిన నవజాత శిశువులు మొదలు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు.. వరదల్లో పడుతున్న పాట్లు అన్నీ ఇన్నికావు. మూడ్రోజుల తర్వాత వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో.. కొందరు కాలినడకన బయటకు వస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌ సాయంతో మరికొందరు బయటపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు సరైన ఆహారం లేక.. ఎవరికి తోచిన విధంగా వారు వరద నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రమ్ములు, లారీ ట్యూబ్‌లు.. ప్లాస్టిక్ బాక్స్‌లు ఇలా ఏది దొరికితే అది.. ఎలాగైనా వరద నుంచి బయటపడాలని ప్రజలు పెద్ద సాహసాలే చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో NDRF రెస్క్యూ చేపడుతోంది. చిన్నారులు, గర్భిణీ, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు.

అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం పట్టణం నీట మునిగింది. చాలా మంది ప్రజలు ఇంకా జలదిగ్బందంలోనే ఉన్నారు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయారు. కాగా వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. సినీ ప్రముఖులు పెద్దెత్తున విరాళాలు అందిస్తున్నారు. ఆయ్ మూవీ యూనిట్, కల్కి నిర్మాతలు అశ్విని దత్త (రూ. 25 లక్షలు), ఎన్టీఆర్( తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 1కోటి), విశ్వక్ సేన్( రూ. 10లక్షలు), సిద్ధూ జొన్నలగడ్డ(రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30లక్షలు), సూపర్ స్టార్ మహేష్ బాబు( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి ), బాలకృష్ణ (రూ. 1 కోటి), పవన్ కళ్యాణ్ ( రూ.1కోటి ), నటి అనన్య నాగళ్ళ ( రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.5లక్షలు)ఇలా సినీ స్టార్స్ తెలుగు రాష్ట్రాల సీఎం సహాయనిధులకు భారీ విరాళం ప్రకటించారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆంద్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయక నిధి చెరో రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు మెగాస్టార్. ఇక తెలుగు రాష్ట్రలో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన నష్టంతనకు కలిచివేసిందని అన్నారు చిరు. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు చిరు. అలాగే పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో ప్రభుత్వంలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలిగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు చిరంజీవి. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ షేర్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి