AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సిల్క్ స్మిత కంటే ముందే సెన్సేషన్.. స్టార్ హీరోలను మించిన క్రేజ్.. జీవితంలో కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు..

70వ దశకంలో వెండితెరను ఏలిన డ్యాన్సింగ్ సంచలనం ఆమె. ముఖ్యంగా స్పెషల్ పాటలకు, గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆమె వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కళను దైవంగా భావించి, అవమానాలను తట్టుకొని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె అజ్ఞాత జీవిత కథ ఇది. ఇప్పటికీ ఆమె జీవితం గురించి మాట్లాడితే ప్రతి ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటారు.

Tollywood : సిల్క్ స్మిత కంటే ముందే సెన్సేషన్.. స్టార్ హీరోలను మించిన క్రేజ్.. జీవితంలో కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు..
Jyothi Lakshmi
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2026 | 6:53 PM

Share

1970వ దశకంలో భారతీయ సినీ రంగంలో, ముఖ్యంగా దక్షిణాదిలో ఒక డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా వెలుగు వెలిగిన తార జ్యోతిలక్ష్మి. ముఖ్యంగా సిల్క్ స్మిత కంటే ముందే ఆమె సినీరంగాన్ని ఏలేసింది. ఆమె పేరు కేవలం ఒక నటిది కాదు, అదొక బ్రాండ్‌గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. ఆమె పాట థియేటర్లలో మొదలైతే కుర్రకారు హార్ట్ బీట్ పెరిగేది, సినిమాకి కొత్త కళ వచ్చేది. ఎల్.ఆర్.ఈశ్వరి పాట, జ్యోతిలక్ష్మి ఆట ఆ రోజుల్లో పిచ్చి క్రేజ్ సంపాదించుకున్నాయి. దాదాపు ఇరవై ఏళ్లపాటు తన పాటతో సినీ లోకాన్ని ఏలిన జ్యోతిలక్ష్మి, తెలుగు సినిమా ప్రత్యేక గీతాలకు తొలి అడుగులు నేర్పిన ఘనతను సొంతం చేసుకున్నారు.  ఆమె చివరి సోదరి జయమాలిని కూడా తర్వాత కాలంలో గ్లామరస్ స్పెషల్ సాంగ్స్ క్వీన్ గా ఎదిగారు. చిన్నతనంలోనే జ్యోతిలక్ష్మిని తన సోదరి ధనలక్ష్మికి దత్తత ఇచ్చేశారు రామరాజన్. ప్రముఖ దర్శకుడు టి.ఆర్. రామన్న ఆమెకు దగ్గర బంధువు కాగా, తమిళ సినిమా తొలి డ్రీమ్ గర్ల్ టి.ఆర్. రాజకుమారి ఆమెకు అత్త వరుస అవుతారు.

1954లో వచ్చిన “కూండుక్కిలి” చిత్రంతో బాలనటిగా పరిచయం అయ్యారు. 1963లో ఎంజీఆర్ హీరోగా నటించిన “పెరియ ఇడత్తు పెణ్” చిత్రంతో “జ్యోతిలక్ష్మి” పేరుతో తెరపైకి వచ్చి అదే పేరుతో కొనసాగారు. చిన్నతనంలో ప్రసిద్ధ నాట్యాచార్యుడు తంజయ్ రామయ్య దాస్ పిళ్ళై దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం ఆమె కెరీర్‌కు పునాది వేసింది. తెలుగులో జ్యోతిలక్ష్మి తొలి చిత్రం 1967లో వచ్చిన “పెద్దక్కయ్య”. శోభన్‌ బాబు హీరోగా నటించిన “ఇదాలౌకంలో” చిత్రంలోని “గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూర్చున్నాడు” పాట భారీ హిట్ అయింది. అప్పటి నుంచి స్పెషల్ సాంగ్స్‌కు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. 1970లలో జానపదం, క్రైం, సాంఘికం ఇలా ఏ సినిమా అయినా జ్యోతిలక్ష్మి పాట తప్పనిసరిగా ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు అనేక ప్రముఖ నటులతో కలిసి నటించారు. నలుపు-తెలుపు చిత్రాల నుంచి రంగుల సినిమాల వరకు ఆమె హవా కొనసాగింది. 300కు పైగా చిత్రాల్లో వెయ్యి పాటలకు పైగా డ్యాన్స్ చేసిన ఆమె, తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఒకసారి అద్దె ఇంటి కోసం చెన్నై మొత్తం తిరిగినా, “నీలాంటి డ్యాన్సర్లకు మేము ఇల్లు ఇవ్వం” అని మొహం మీదే చెప్పేశారట. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగారు. “తెరపై మా నటన చూసి మా క్యారెక్టర్‌ని అంచనా వేస్తే ఎలా?” అని ప్రశ్నించేవారు. “నృత్యం నా వృత్తి, అదే నా దైవం. నేనెప్పుడూ నన్ను తక్కువ చేసుకోను. ఎవరెన్ని అనుకుంటే నాకేమిటి” అని ఆమె తన జీవితాన్ని కొనసాగించారు. తన కెరీర్‌లో సహనటి విజయలలిత నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆమెకు, ఆ తర్వాత తన చెల్లెలు జయమాలిని నుంచే పోటీ ఎదురైంది. అయినా “పోటీ ఇచ్చింది నా చెల్లెలే కదా” అని మురిసిపోయేవారు.

వ్యక్తిగత జీవితంలోనూ జ్యోతిలక్ష్మి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో, అంటే 1970వ దశకంలో, తమిళనాడులోని మన్నార్‌గుడికి చెందిన వాసుదేవన్‌తో ఆమె వివాహం జరిగింది. వాసుదేవన్‌కు అప్పటికే పెళ్లయి, భార్య ఉన్నప్పటికీ పిల్లలు లేరు. అతని తల్లి ఆదేశం మేరకు జ్యోతిలక్ష్మి అతనికి భార్య అయ్యారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో వీరి వివాహాన్ని రహస్యంగా ఉంచి సహజీవనం చేశారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా కూతురు మీనాక్షిని కన్నారు. అయితే ఈ ఎనిమిదేళ్లు వాసుదేవన్ ఆమెను తీవ్రంగా వేధించారు. అతని ప్రవర్తన కారణంగా ఆమె కొన్ని సినిమాలు కూడా కోల్పోయి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఆమె చెల్లెలు జయమాలిని సినీ రంగ ప్రవేశం చేసింది. వాసుదేవన్ బారి నుంచి తప్పించుకునేందుకు ముంబై పారిపోయిన జ్యోతిలక్ష్మి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. వాసుదేవన్‌తో సంబంధం లేదని ప్రకటించిన తర్వాత ఛాయాగ్రాహకుడు సాయి ప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. జ్యోతిలక్ష్మి కూతురు మీనాక్షి, జ్యోతి మీనా పేరుతో నటిగా పరిచయమైనా తల్లిలా పేరు తెచ్చుకోలేకపోయారు. జ్యోతిలక్ష్మి 2016 ఆగస్టు 9న బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

Follow Us