Tollywood: ఒక్క రోజు వేషానికి వెయ్యి రూపాయలా..? అసలు ఏం జరిగిందంటే..?
తెలుగు చిత్ర పరిశ్రమలోని మహానటులలో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన ఆత్మకథలో పేర్కొన్న ఒక సంఘటన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మిస్సమ్మ చిత్రంలో ఒక రోజు వేషానికి నిర్మాత చక్రపాణి వెయ్యి రూపాయలు ఇవ్వడం గుమ్మడిని ఆశ్చర్యపరిచింది. ఇది ఆ రోజుల్లో నిర్మాతలు నటుల పట్ల చూపిన ఆదరణకు నిదర్శనం.

తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన మహానటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. ఆయన తన నటనా జీవితంలో ప్రతి పాత్రకు న్యాయం చేశారు. చివరి రోజుల్లో తన అనుభవాలను తీపి జ్ఞాపకాలు చేదు అనుభవాలు పేరుతో ఆత్మకథగా రాసుకున్నారు. అందులో ఆయన పేర్కొన్న ఒక సంఘటన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. 1950లో అదృష్ట దేవుడు చిత్రంతో తొలి అవకాశం పొందిన గుమ్మడికి ఆ తర్వాత చిన్న చిన్న వేషాలు తప్ప పెద్ద అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఆయన పోషించిన పాత్రల్లో మిస్సమ్మ చిత్రంలోని చిన్న వేషం ఒకటి. అది నిజానికి ఒక రోజు వేషం మాత్రమే. ఎన్టీఆర్, సావిత్రి ఒక సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే, వారిద్దరినీ ఇంటర్వ్యూ చేసే ప్రొప్రైటర్ పాత్ర అది. ఈ పాత్ర కోసం నిర్మాత చక్రపాణి ఇద్దరు ముగ్గురు నటులను చూసినా, ఎవరూ ఆయనకు నచ్చలేదు. అప్పుడు గుమ్మడిని పిలిపించారు. “ఒక్క సీను వేషమే కానీ పేరు వస్తుంది, వెయ్యి రూపాయలు ఇస్తాం” అని చక్రపాణి గుమ్మడికి చెప్పారు. ఇది కామెడీ టచ్ ఉన్న సీన్ కావడంతో, చిత్ర దర్శకుడు ఎల్. వి. ప్రసాద్ ఎలా చేయాలని నటించి చూపించారు. గుమ్మడి ఆ పాత్రను చేశారు. అక్కడే ఉన్న చక్రపాణి ఓకే చేశారు.
ఆ రోజుల్లో పెద్ద వేషం అంటే 20 రోజులు పని చేయాలి, అందుకు 2000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఒక్క రోజు పని చేసినందుకే తనకు 1000 రూపాయలు ఇవ్వడంతో గుమ్మడి ఆశ్చర్యపోయారు. వెంటనే చక్రపాణి దగ్గరికి వెళ్లగా, ఆయన “కొత్తగా కాపురం పెట్టావు కదా, పైగా ముగ్గురు పిల్లలని అంటున్నావు. ఖర్చులు ఉంటాయి కదా, తీసుకో” అన్నారు. ఆ రోజుల్లో నిర్మాతలు ఆర్టిస్టుల కష్టసుఖాలను అంతగా గమనించి ఆదుకునేవారని ఈ సంఘటన తెలియజేస్తుంది. అంతేకాదు పెద్ద హీరోలు, నటులు సైతం నిర్మాతల పట్ల తమ భయాన్ని, భక్తిని ప్రదర్శించేవారు. తమకు అన్నం పెట్టేది వారేనని అప్పటి నటీనటులు భావించేవారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
