ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందం.. ఆ ఇద్దరితో జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేను.. వేణు మాధవ్ కామెంట్స్ వైరల్..
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా, హాస్య నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నవారిలో వేణు మాధవ్ ఒకరు. తనదైన విలక్షణమైన నటనతో, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన.. చిన్న వయసులోనే కన్నుమూశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటుడు వేణు మాధవ్. ఆయన కేవలం నటుడిగానే కాకుండా మిమిక్రీ ఆర్టిస్టుగా, టీవీ యాంకర్గా కూడా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో నవ్వులు పూయించిన ఆయన.. చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. వేణు మాధవ్ మరణం సినీరంగానికి తీరని లోటు. ఇప్పటికీ ఈ హాస్యనటుడిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతారు ప్రేక్షకులు. ఇధిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో వేణు మాధవ్ తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఒక జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. కొత్తగా మారుతి కార్ కొన్నప్పుడు, రామోజీ ఫిలిం సిటీలో ఒక షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్లో ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మానందంలతో కలిసి వేణు మాధవ్ ఉన్నారు. సరదాగా బ్రహ్మానందంకు కన్ను కొట్టి, ఎం.ఎస్. నారాయణను ఉద్దేశిస్తూ “అన్నా, ఇది నేను కొత్తగా కొన్న కార్, నువ్వు ఫస్ట్ ఎక్కాలి” అని అన్నారట. బ్రహ్మానందం కూడా రావాలని అనుకున్నా, వేణు మాధవ్ మాత్రం ఎం.ఎస్. నారాయణను మాత్రమే మొదట ఎక్కించుకున్నారు. కారులో కూర్చున్న ఎం.ఎస్. నారాయణతో, వేణు మాధవ్ చిలిపిగా కారును వేగంగా నడిపి, రోడ్డు పక్కన ఉన్న పేవ్మెంట్పైకి సగం ఎక్కించారట.
కారు అదుపు తప్పినట్లుగా కనిపించడంతో, ఎం.ఎస్. నారాయణ భయపడి “ఒరేయ్, ఆపరా! చచ్చిపోతావురా” అని కేకలు వేశారట. ఈలోగా, వేణు మాధవ్ కారులో బ్రేకులు వెతుకుతున్నట్లు నటిస్తూ, “బ్రేకు ఎక్కడ ఉందో వెతుకుతున్నాను, మీకు డ్రైవింగ్ రాదా అని అడిగితే, మిమ్మల్ని ఎక్కించుకున్నాకే నేర్చుకుంటున్నాను” అని బదులిచ్చారట. ఈ మొత్తం సంఘటనను వెనుక సీటులో కూర్చుని చూస్తున్న బ్రహ్మానందం నవ్వి నవ్వి సీటులో పడిపోయారని వేణు మాధవ్ వివరించారు. చివరికి, కారును దించి మామూలుగా బ్రేకు వేసి ఆపినట్లు తెలిపారు. వేణు మాధవ్ తన కెరీర్లో మూడు సినిమాల్లో హీరోగా నటించారు. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం. హంగామా హిట్ అయ్యిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, తాను ఎప్పుడూ హీరోగా స్థిరపడాలని అనుకోలేదని, తనను తాను పక్కా కమెడియన్గానే భావిస్తానని స్పష్టం చేశారు. “నేను పక్కా కమెడియన్ నే, పక్కా కామెడీనే చేస్తా” అని ఆయన చెప్పారు.
రామ్ గోపాల్ వర్మతో అనుభవం:
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకున్న మంచి అనుబంధాన్ని వేణు మాధవ్ పంచుకున్నారు. సునీల్తో కలిసి నటించిన అప్పల్రాజు (అప్పారావు) సినిమా ఆడియో ఫంక్షన్లో రామ్ గోపాల్ వర్మ తమను ఎంతగానో అభినందించారని చెప్పారు. “సార్, మీరు ఎప్పుడూ దెయ్యాలతో, తల తిరిగే బొమ్మలతో సినిమాలు చేస్తుంటారు కదా, మమ్మల్ని ఇంతమంది కమెడియన్లతో పనిచేస్తే మీకు ఏమనిపిస్తుంది?” అని తాను అడిగినప్పుడు, రామ్ గోపాల్ వర్మ “సో మెనీ దెయ్యమ్స్ హియర్” అని సరదాగా బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు. వేణు మాధవ్ తన దాతృత్వ గుణాన్ని గురించి కూడా వివరించారు. “నా జీవితంలో నేను సంపాదించిన దాంట్లో సగం ఇవ్వడమే జరిగింది అందరికీ” అని ఆయన తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
