Sekhar Movie: జీవిత రాజశేఖర్ దంపతులకు షాక్.. శేఖర్ సినిమా ప్రదర్శన నిలుపుదల చేస్తూ కోర్టు ఆదేశాలు
రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన శేఖర్ సినిమాను వెంటనే నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిత్ర ప్రదర్శన అన్ని థియేటర్లలో ఆగిపోయింది.
Jeevitha Rajasekhar: జీవిత-రాజశేఖర్ దంపతులకు షాక్ తగిలింది. రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత తెరకెక్కించిన ‘శేఖర్’ సినిమా నిలుపుదల చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సినిమా ప్రదర్శన అన్ని థియేటర్లలో ఆగిపోయింది. రాజశేఖర్ తనకు డబ్బులివ్వాలని కోర్టును ఆశ్రయించారు ఫైనాన్సియర్ పరంధామరెడ్డి. కోర్టు ఆదేశించినా డబ్బు డిపాజిట్ చేయకపోవడంతో.. తాజాగా సినిమాను ఆపాల్సిందే అంటూ ఉత్తర్వులొచ్చాయి. తన దగ్గర 65 లక్షలు అప్పుగా తీసుకున్న దర్శకనిర్మాత జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు ఫైనాన్షియర్ ఎ.పరంధామరెడ్డి. ఆదివారం సాయంత్రం నాలుగున్నర లోగా సెక్యూరిటీ డిపాజిట్గా కోర్టులో సమర్పించాలని కోరారు. అలా డిపాజిట్ చేయని పక్షంలో సినిమాపై హక్కుల్ని తనకే ఇవ్వాలన్నది పరంధామరెడ్డి పిటిషన్ సారాంశం. ఆమేరకే ఇప్పుడు కోర్టు ఉత్తరులొచ్చాయి. కోర్టు తీర్పుపై రాజశేఖర్ స్పందించారు. తన సినిమాను కొందరు కుట్ర ప్రకారం అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. ఎంతో కష్టపడి ‘శేఖర్’ సినిమా తెరకెక్కించామని చెప్పారు. సినిమానే తమ జీవితమని.. శేఖర్ సినిమా తమకు ఒక హోప్ లాంటిదని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తనకు అర్థం కావడం లేదని రాజశేఖర్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు దక్కాల్సిన ప్రాధాన్యం తప్పుకుండా దక్కుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022
మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్గా ‘శేఖర్’ రూపొందింది. జీవిత-రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె శివాని ఈ మూవీలో కీలక పాత్రలో నటించింది. మాతృకతో పోల్చితే తెలుగులో నేటివిటీకి తగ్గట్లుగా చిన్న చిన్న మార్పులు చేసినా.. స్టోరీ మొత్తం యాజిటీజ్గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ నెల 20న విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణే లభిస్తుంది. సినిమాను రాజశేఖర్ ఫ్యామిలీ బాగానే ప్రమోట్ చేసుకుంది. కలెక్షన్స్ పర్వాలేదు అనుకుంటున్న తరుణంలో.. చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశాలివ్వడం వారికి పెద్ద దెబ్బే.