
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు. తన సినీ ప్రయాణంలో నందమూరి బాలకృష్ణతో అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు. బాలయ్యతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, నటన పట్ల అంకితభావాన్ని పృథ్వీరాజ్ ఇటీవల గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బాలకృష్ణను తన అభిమాన నటుడిగా పేర్కొన్న పృథ్వీరాజ్, ఆయనతో తన కెరీర్లో దాదాపు ఐదు చిత్రాలలో నటించానని తెలిపారు. బాలయ్య అన్న తనకు చాలా క్లోజ్ అని, తరచుగా మంచి పాత్రలు ఉన్నప్పుడు తన పేరును సిఫార్సు చేస్తారని చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్. ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక కుటుంబం లాంటిది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా ఆ బంధం కొనసాగుతుంది అని పృథ్వీరాజ్ అన్నారు. బాలకృష్ణతో తనకున్న సంబంధానికి నిదర్శనంగా, సమరసింహా రెడ్డి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక అద్భుత సంఘటనను పృథ్వీరాజ్ పంచుకున్నారు.
ఈ చిత్రంలో పృథ్వీరాజ్ వాసు అనే పాత్రలో నటించారు. సినిమాలో ఒక సన్నివేశంలో, బాలకృష్ణ పాత్ర తన సోదరుడు వాసును అనుకోకుండా చంపేస్తాడు. చనిపోయిన వాసు (పృథ్వీరాజ్) పాత్రను మోస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ సన్నివేశం చిత్రీకరణ సమయంలో, పృథ్వీరాజ్ అప్పట్లో 90 కిలోల బరువు ఉండేవారు. రిహార్సల్స్ సమయంలో స్టంట్ మ్యాన్ సైతం “అబ్బా, ఏంట్రా ఇంత బరువు ఉన్నావ్?” అని అనడంతో ఈ సన్నివేశం కష్టతరంగా మారింది. బరువు కారణంగా రోప్ లేదా క్రేన్ ఉపయోగించాలని యూనిట్ సభ్యులు సూచించినప్పుడు.. బాలకృష్ణ అందుకు నిరాకరించారట. “అదేమీ వద్దు. నేను డూప్ లేకుండా స్వయంగా చేస్తాను” అని బాలయ్య స్పష్టంగా చెప్పారట. మొత్తం స్ట్రీట్ను కవర్ చేసేలా నాలుగైదు కెమెరాలు సిద్ధంగా ఉంచారు. డైరెక్టర్ “స్టార్ట్ కెమెరా” అనగానే, బాలకృష్ణ పృథ్వీరాజ్ను అలవోకగా ఎత్తుకొని ధమ్ ధమ్ ధమ్ ధమ్ అని దాదాపు 500 అడుగుల దూరం ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఆ తర్వాత పృథ్వీరాజ్ను కింద పెట్టి “షాట్ ఓకేనా?” అని అడిగారు.
ఈ సంఘటన పృథ్వీరాజ్ను ఎంతగానో ఆశ్చర్యపరిచిందట. బాలకృష్ణ అంత బరువును ఎలా మోయగలిగారని తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ విషయం గురించి అడిగినప్పుడల్లా బాలకృష్ణ ఎప్పుడూ, “నేను చేయలేదు బాబు, సమరసింహా రెడ్డి చేశాడు” అని అనేవారని పృథ్వీరాజ్ తెలిపారు. ఇది బాలకృష్ణలోని అసాధారణ అంకితభావానికి, పాత్రలో లీనమయ్యే తత్వానికి నిదర్శనం అని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు వంటి బయోపిక్లలో బాలకృష్ణతో కలిసి పనిచేసినప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయని పృథ్వీరాజ్ గుర్తుచేసుకున్నారు. కూర్చున్నప్పుడు బాలయ్య అన్న తనను పిలిచి, ఆ రోజుల్లో జరిగిన సంఘటనలు, హిందీ నటుల గురించి కథలు చెప్పమనేవారని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి