
సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వం సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు వివరాలు వెల్లడించారు. సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని స్పష్టంగా వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న్యాయం చేసేందుకు, అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని, కలిసినా కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు. సినిమాకు సంబంధించిన అనుమతులు, టికెట్ రేట్ల నిర్ణయాల్లో తక్షణ స్పందనతో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు. చిత్రపరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతోందని, హోం శాఖ విచారణ అనంతరం నివేదిక అందించిన తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామన్నారు.
జూన్ 12న విడుదల కానున్న “హరిహరవీరమల్లు” చిత్రం విషయంలో ఈ తరహా సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయో వాస్తవాలు వెలికితీస్తామన్నారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలో పనిచేసే వర్గాల హితం, కళాకారుల హక్కులు, ప్రజల అభిరుచి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైనవిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించమని, చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, ఎవరి ప్రభావంతోనైనా పరిశ్రమలో కల్లోలం సృష్టించాలన్న యత్నాలను ఉపేక్షించమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
సినిమా టికెట్ల రేట్లు పెంచమని సినీ రంగం నుండి నిర్మాతలు విడివిడిగా వచ్చి తమను కలుస్తారని, తాము కూడా అందుకు సరే అని చెబుతున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారని తద్వారా అధికారులు కోర్టులు చుట్టూ తిరిగే దుస్థితి నెలకొందన్నారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోందన్నారు. ఈ విధానాలన్నింటికి చెక్ పెట్టి నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాలను తీసుకురావాలని భావించామన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే తాము రేట్ల పెంపుకు అనుమతిస్తున్నామన్నారు. తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని కొందరు అహంభావంతో మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. ఇది సరైన విధానం కాదని సూచించారు. సినిమా రంగం వ్యాపారమని కొందరు మాట్లాడుతున్నట్లుగా సినిమా రంగానికి ప్రభుత్వంతో సంబంధం లేనప్పుడు గత ప్రభుత్వాన్ని సినీ ప్రముఖులు ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు. నిర్ణయాలు ఎందుకు చేశారని నిలదీశారు. తహసిల్దార్ లను థియేటర్ల దగ్గర పెట్టి రేట్లను ఎందుకు నియంత్రించారు అని మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. ఇక మీదటైనా అందరూ కలిసికట్టుగా, సరైన రీతిలో వ్యవహరించాలన్నారు. సినిమా థియేటర్ల అంశంపై అల్లు అరవింద్ మాట్లాడింది సహేతుకంగా ఉందన్నారు. సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. సినీ రంగం అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు. సినిమా తీయడం కోసం వేలాది మంది కృషి చేస్తారని, వందలాది మంది దీనిపై ఆధారపడుతున్నారన్న అంశం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సహకరిస్తూనే ఉన్నామన్నారు.
సినిమా షూటింగ్ లకు త్వరితగతిన అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. సినిమా టికెట్ పై రూపాయి పెంచితే ప్రభుత్వానికి 25 పైసలు జీఎస్టీ వస్తుందన్నారు. ఈ అంశాన్ని ఇటీవల రాజమహేంద్రరంలో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ఫ్రీరిలీజ్ వేడుకల్లో సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే తరుచూ ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా నిర్మాతలకు తాను ఒక లేఖ రాశానని, అంతా కలిసి కూర్చొని సినీరంగ సమస్యలు పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి