సంక్రాంతి బరిలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఇస్మార్ట్..
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో 'ఇస్మార్ట్ శంకర్' రామ్ మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్నారు.
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ మరోసారి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఆయన నటిస్తున్న ‘రెడ్’ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 24న ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ మాట్లాడుతూ మూవీకి సంబంధించిన విషయాలను వెల్లడించారు. సంక్రాంతి తరుణంలో వస్తున్న తన మూడో చిత్రం రెడ్ అన్నారు. షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైన తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో చిత్రాన్ని నిలిపివేశామని చెప్పారు.
అయితే ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ఉద్ధేశ్యంతో టీమ్ అంతా ఇన్ని నెలలు నిరీక్షించిందన్నారు. రెడ్ తప్పకుండా ప్రేక్షకుల అంచనాల్ని అందుకునే చిత్రమవుతుందన్నారు. మణిశర్మ అద్భుతమైన సంగీతాన్నందించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలకు కూడా మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలుగా నటిస్తుండగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన పాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రామ్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుంది. ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు భిన్న వ్యక్తిత్వాలు కలిగిన యువకుల కథగా దీనిని తెరకెక్కించారు.