‘ఎఫ్ 3’కి భారీ బడ్జెట్.. ఓకే చెప్పిన దిల్ రాజు.. వెంకీ, వరుణ్లకు సమాన పారితోషికం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్ 3 డిసెంబర్ 14న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎఫ్ 2లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా
Anil Ravipudi F3: అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్ 3 డిసెంబర్ 14న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఎఫ్ 2లో నటించిన వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్లే ఈ సీక్వెల్లో భాగం కానున్నారు. వీరితో పాటు మరికొందరు ఎఫ్ 3లో నటించనున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రేక్షకుల చేత మరింత నవ్వులు పూయిస్తుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో అనిల్ వెల్లడించారు. కాగా ఈ మూవీ కోసం 70కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అందులో ప్రధాన హీరోలైన వెంకటేష్, వరుణ్ తేజ్లకు రూ.12కోట్ల చొప్పున ముట్టనుందని.. అలాగే తమన్నాకు 1.5కోట్లు, మెహ్రీన్కి 70లక్షలు, అనిల్ రావిపూడికి 9 కోట్లు, దేవీ శ్రీ ప్రసాద్కి 2 కోట్లు ఇవ్వనున్నారని సమాచారం. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 పెద్ద విజయం సాధించడంతో పాటు దిల్ రాజుకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అలాగే జాతీయ స్థాయి అవార్డు కూడా దక్కించుకుంది. దాంతో పాటు నటీనటులు కూడా బాగానే డిమాండ్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3కి దిల్ రాజు ఇంత బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమాచారం.
కాగా టాలీవుడ్లో సీక్వెల్లు విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. బాహుబలి మినహా మిగిలిన ఏ సీక్వెల్లు అంత విజయాన్ని సాధించలేదు. కొన్ని అయితే ఘోర పరాజయం పాలయ్యాయి. అయితే వాటన్నింటిని పట్టించుకోకుండా అనిల్ కథపై ఉన్న నమ్మకంతో ఈ సీక్వెల్కి దిల్ రాజు భారీ బడ్జెట్ని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.