AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha : ఆరోజు షూటింగ్‏లో ఆ హీరో లేకపోతే నేను చనిపోయేదాన్ని.. అతడు నాకు దేవుడితో సమానం.. నటి సుధ..

సినీనటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తల్లిగా, వదినగా, అక్కగా నటించి మెప్పించారు. ఇప్పటికీ ఆమె వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో తాను చనిపోయేదానిని అని.. తనను ఓ హీరో కాపాడారని చెప్పుకోచ్చారు. ఇప్పటికీ ఆయనను తన దేవుడిగా భావిస్తానని చెప్పారు.

Sudha : ఆరోజు షూటింగ్‏లో ఆ హీరో లేకపోతే నేను చనిపోయేదాన్ని.. అతడు నాకు దేవుడితో సమానం.. నటి సుధ..
Sudha
Rajitha Chanti
|

Updated on: Jul 23, 2026 | 5:08 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటిగా కొనసాగుతున్న సుధా, తన కెరీర్‌లో అక్కినేని నాగార్జునతో తనకున్న ప్రత్యేక అనుబంధం, ఆయన తన జీవితంలో రెండుసార్లు ప్రాణం నిలిపిన సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగార్జునను తాను ఒక కుటుంబ స్నేహితుడిగా, తన దేవుడిగా భావిస్తానని ఆమె స్పష్టం చేశారు. దాదాపు 17 చిత్రాలలో నాగార్జునతో కలిసి నటించిన అనుభవం తనదని సుధా గుర్తు చేసుకున్నారు. మొదటి సంఘటన “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం” చిత్రం షూటింగ్ సమయంలో చోటు చేసుకుంది. అప్పుడు చెన్నై నుండి హైదరాబాద్‌కు పరిశ్రమ పూర్తిగా మారకపోయిన రోజులు అవి. సుధా, ఆమె తల్లి, హెయిర్ డ్రెస్సర్, అసిస్టెంట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌కు వచ్చారు. మొదటి రోజు షూటింగ్ సజావుగా సాగినా, రెండో రోజు ఆమెకు అనారోగ్యంగా అనిపించింది. ఆ తర్వాత రోజు అర్ధరాత్రి తీవ్రమైన మోషన్స్, వాంతులు, 102 డిగ్రీల జ్వరంతో బాధపడ్డారు. మేనేజర్ ఆమెను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అపెండిసైటిస్‌గా నిర్ధారించి, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రమాదమని తెలిపారు. అయితే, ఆ రోజుల్లో ఫిలింనగర్ అడవిలా ఉండేదని, అక్కడ హాస్పిటల్ వాతావరణం నచ్చక, చెన్నైకి వెళ్లాలని సుధా చికిత్సకు నిరాకరించారు. అపోలో నుండి రహస్యంగా బయటపడి, షూటింగ్‌కు బయలుదేరారు. మేకప్ రూమ్‌లో సిద్ధమవుతుండగా, ఆమె కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయారు. పక్కనే ఉన్న నాగార్జున ఆమెను పట్టుకుని, తక్షణమే ఆసుపత్రికి తరలించారు. 45 నిమిషాలలోపు ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో దర్శకుడు కే. కోదండరామిరెడ్డిని చూసి, బ్రతికుంటే తిరిగి వస్తానని, లేకపోతే రెమ్యూనరేషన్ ఇవ్వవద్దని సుధా చెప్పడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. ఆపరేషన్ జరిగిన ఐదు రోజుల తర్వాత, ఏడో రోజున రాజమండ్రి షూటింగ్‌కు తిరిగి వెళ్ళిపోయారు.

రెండో సంఘటన “రావోయి చందమామ” చిత్రం చిత్రీకరణ సమయంలో జరిగింది. ఒక కారు ప్రమాదం కారణంగా సుధా స్పాండిలోసిస్, స్లిప్ డిస్క్ సమస్యలతో బాధపడ్డారు. ఆమె మెడలోని కండరాలు ఆరు చోట్ల తెగిపోయాయి, తీవ్రమైన నొప్పి ఉండేది. రాత్రి షూటింగ్ సమయంలో నొప్పి భరించలేక ఒక మూలన కూర్చుని ఏడుస్తున్నారు. ఇది గమనించిన నాగార్జున, ఆమె మేనేజర్‌ను పిలిచి విషయం అడగమని చెప్పారు. సుధా నాగార్జునతో నేరుగా మాట్లాడటానికి ఇబ్బంది పడతానని, ఇప్పటికీ ఆయన కళ్ళల్లోకి చూసి మాట్లాడలేనని తెలిపారు. మేనేజర్ అడిగినప్పుడు, తన మెడ నొప్పి, తలనొప్పి గురించి చెప్పి ప్యాకప్ చెప్పమని కోరారు. నాగార్జున స్వయంగా వచ్చి అడిగినప్పుడు, ప్రమాదం గురించి, తీవ్రమైన నొప్పి గురించి వివరించారు. వెంటనే నాగార్జున తన వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి, సుధాను పరీక్షించమని చెప్పారు. వైద్యుడు ఆమె పరిస్థితిని చూసి, ఈ స్థితిలో పని చేయడం గొప్ప విషయమని, ఎవరైనా బెడ్ రెస్ట్ తీసుకుంటారని, ఆమెకు మూడు నెలలు విశ్రాంతి అవసరమని తెలిపారు.

ఈ రెండు సందర్భాలలో నాగార్జున చూపిన మానవత్వం, సమయస్ఫూర్తి తనకు మర్చిపోలేనివని సుధా పేర్కొన్నారు. చిరంజీవి కూడా ఒకసారి “గ్రీకు వీరుడు” షూటింగ్ సమయంలో సుధా అపెండిసైటిస్ సంఘటనను గుర్తు చేసుకున్నారని ఆమె వెల్లడించారు. నాగార్జునతో తన కెరీర్ మొదట్లో “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం” సమయంలో, వదిన పాత్రకు ఈమె ఎవరు అని ఆయన అడిగారట. ఆ తర్వాత ఆమె పనితీరు చూసి ఆయన అభిప్రాయం మారిందని సుధా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ నాగార్జునను కలిసినప్పుడు కాఫీ, టీలకు బదులుగా డ్రై ఫ్రూట్స్ అడుగుతానని, ఆయన తన ఆరోగ్య స్పృహను గౌరవిస్తారని నటి సుధా వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

Follow Us