AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సిత్రాలు.. 25శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

West Bengal Polls 2021: పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థుల్లో 32 మంది తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా తమ అఫిడవిట్స్‌లో వెల్లడించారు.

West Bengal Election 2021: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సిత్రాలు.. 25శాతం అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
ప్రతీకాత్మక చిత్రం
Janardhan Veluru
|

Updated on: Mar 29, 2021 | 11:15 AM

Share

పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారపర్వం వేడెక్కింది. రెండో విడతలో 30 నియోజకవర్గాలకు ఏప్రిల్ 1న పోలింగ్ జరగనుండగా…ఈ స్థానాల్లో రేపటి (మంగళవారం)తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మొదటి విడత ఎన్నికల్లో 79.79 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం తెలిసిందే. నక్సల్స్ ప్రభావిత జంగల్‌మహల్ ప్రాంతంలోని 30 నియోజకవర్గాల్లో పటిష్ట బందోబస్తు మధ్య ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడు రెండో విడత పోలింగ్‌పై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ కూడా ఉంది. నందిగ్రామ్‌లో మాజీ టీఎంసీ నేత, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మమతా బెనర్జీని ఢీకొంటున్నారు.

రెండో విడత  ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలు, విద్యార్హతలు తదితర వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ADR) వెల్లడించింది. ఎన్నికల బరిలో నిలుస్తున్న 171 మంది అభ్యర్థుల స్వయంగా తమ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్స్‌ను విశధీకరించి…ఈ వివరాలను బహిర్గతం చేశారు. రెండో విడత ఎన్నికల బరిలో నిలుస్తున్న 171 మంది అభ్యర్థుల్లో 43 మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. అంటే మొత్తం అభ్యర్థుల్లో దాదాపు 25శాతం మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ నుంచి 17 మంది, తృణాముల్ కాంగ్రెస్ నుంచి 8 మంది, సీపీఎం నుంచి ఏడుగురు, సోషలిస్ట్ యునిటీ సెంటర్ ఆఫ్ ఇండియా(కమ్యునిస్ట్) నుంచి ముగ్గురు, కాంగ్రెస్, బీఎస్పీ నుంచి తలా ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఉన్నారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో 36 మంది అభ్యర్థులు తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా తమ అఫిడవిట్స్‌లో డిక్లేర్ చేశారు. వీరిలో 11 మంది అభ్యర్థులు మహిళా సంబంధిత నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఏడీఆర్ విశ్లేషించింది.

6 రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు.. రెండో దఫా పోలింగ్ జరిగే 30 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు రెడ్ అలర్ట్ స్థానాలుగా అధికారులు ప్రకటించారు. ఏదైనా నియోజకవర్గంలో ముగ్గురికి మించి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అభ్యర్థులు బరిలో నిలిస్తే…ఆ నియోజకవర్గాన్ని రెడ్ అలర్ట్ నియోజకవర్గంగా ప్రకటిస్తారు.

కరోడ్‌పతి అభ్యర్థులు… ఇదిలా ఉండగా రెండో దఫాలో పోటీ చేస్తున్న 171 మంది అభ్యర్థుల్లో 26 మంది కరోడ్‌పతీలు ఉన్నారు. అంటే తమకు రూ.కోటికి పైగా ఆస్తులు ఉన్నట్లు వారు తమ అఫిడవిట్స్‌లో డిక్లేర్ చేశారు. వీరిలో 11 మంది టీఎంసీ, 10 మంది బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, లోక్ సమయ్ పార్టీ నుంచి ఒక్కొక్కరు, ఓ స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. కరోడ్‌పతి అభ్యర్థుల జాబితాలో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఢీకొంటున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కూడా ఉన్నారు. తనకు రూ.1.05 కోట్ల ఆస్తులు ఉన్నట్లు సువేందు డిక్లేర్ చేశారు.

అభ్యర్థుల విద్యార్హతలు… రెండో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 101 మంది (59శాతం) డిగ్రీ లేదా అంతకు మించి విద్యార్హతలున్నట్లు డిక్లేర్ చేశారు. 63 మంది అభ్యర్థులు (37శాతం) ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నట్లు తెలిపారు.ఇద్దరు అభ్యర్థులు డిప్లొమా చదువుకున్నట్లు తెలపగా..నలుగురు అభ్యర్థులు ప్రాథమిక విద్యను పొందగా, ఓ అభ్యర్థి నిరక్షరాస్యులుగా తెలిపారు.

అభ్యర్థుల వయస్సు… రెండో విడతలో పోటీ చేస్తున్న 171 మంది అభ్యర్థుల్లో 46 మంది తమ వయస్సు 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నట్లు డిక్లేర్ చేశారు. 92 మంది అభ్యర్థులు 41-60 ఏళ్లలోపు ఉన్నారు. 33 మంది అభ్యర్థుల వయస్సు 61-80 ఏళ్లుగా ఉన్నట్లు ఏడీఆర్ తన నివేదికలో విశ్లేషించింది.

మహిళా అభ్యర్థుల సంఖ్య.. రెండో విడత ఎన్నికల బరిలో నిలుస్తున్న 171 మంది అభ్యర్థుల్లో 152 మంది పురుషులు, 19 మంది మహిళలు ఉన్నారు. అంటే మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో కేవలం 11 శాతం మంది మహిళా అభ్యర్థులు మాత్రమే బరిలో నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి..ఓటర్లకు అదిరిపోయే హామీలు…!! థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో వెలుగులు విరజిమ్ముతోన్న ఖుష్భూ.. వీడియో

సీఎం పళనిస్వామిపై నీచమైన వ్యాఖ్యల ప్రతిఫలం, తమిళనాట ఆగ్రహజ్వాలలు.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు