AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Elections: కేరళలో మళ్లీ లెఫ్ట్‌ కూటమికే గెలిచే ఛాన్స్‌ ఎంత వరకు ఉంది? యూడీఎఫ్‌ అధికారంలోకి రాగలదా?

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు యమరంజుగా జరుగుతున్నాయి. మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు, బీజేపీ భీకరంగా తలపడుతున్నాయి. పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టే....

Kerala Elections: కేరళలో మళ్లీ లెఫ్ట్‌ కూటమికే గెలిచే ఛాన్స్‌ ఎంత వరకు ఉంది? యూడీఎఫ్‌ అధికారంలోకి రాగలదా?
Kerala Elections,Kerala Elections,LDF winning again in Kerala,LDF winning again in Kerala,LDF in Kerala,Kerala Elections 2021
Balu
|

Updated on: Apr 01, 2021 | 1:53 PM

Share

Kerala Elections : బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు యమరంజుగా జరుగుతున్నాయి. మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు, బీజేపీ భీకరంగా తలపడుతున్నాయి. పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టే రెండు పార్టీలు ఎన్నికలను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. లోలోపల కాసింత భయం ఉన్నా ఎవరికివారు గెలుపు మాదేనని చెప్పుకుంటున్నారు. ఇక మరో అయిదు రోజుల్లో జరగబోయే కేరళలో కూడా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది.. లెఫ్ట్‌ కూటమి మళ్లీ అధికారంలోకి రావచ్చని సర్వేలు చెబుతున్నా పోలింగ్‌ సమయంనాటికి పరిస్థితులు మారవచ్చనే నమ్మకంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఉంది., 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో అధికారం నిలుపుకునేందుకు ఎల్‌డీఎఫ్‌ బాగా శ్రమిస్తోంది. తమిళనాడులాగే కేరళలో కూడా ప్రతీ అయిదేళ్లకు ప్రభుత్వం మారుతూ ఉంటుంది.. 1977 తర్వాత ఇక్కడ అయిదేళ్లకోమారు ప్రజలు ప్రభుత్వాలను మారుస్తూ వస్తున్నారు.. 2016లో తమిళనాడు ప్రజలు మళ్లీ అన్నాడీఎంకేకు ఎలా పట్టం కట్టారో కేరళ జనం ఇప్పుడు ఎల్‌డీఎఫ్‌కు అలాగే అధికారం కట్టబెడతారన్నది జనం నాడి చెబుతున్న మాట! క్రితంసారి ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు 91 స్థానాలు లభించాయి. ఈ కూటమిలో ఉన్న సీపీఎం 27 శాతం ఓట్లతో 58 సీట్లు గెల్చుకోగా, సీపీఐ ఎనిమిది శాతం ఓట్లతో 19 స్థానాలను దక్కించుకుంది. ఇతరులకు 14 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్‌ అప్పుడు 47 స్థానాలను గెల్చుకుంది. 24 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు 22 సీట్లు, ఏడు శాతం ఓట్లతో ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ 18 స్థానాలు గెల్చుకున్నాయి. కేరళ కాంగ్రెస్‌ (మాని) ఆరు స్థానాలు సంపాదించగా, కేరళ కాంగ్రెస్‌ (జె)కు ఒక సీటు వచ్చింది. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ మధ్య మహా అయితే ఒకటి రెండు శాతం ఓట్ల తేడానే ఉంటూ వస్తోంది.. అందుకే కేరళ ఎన్నికలు అత్యంత ఆసక్తిని కలిగిస్తాయి. ఈ రెండు కూటముల గెలుపోటములు తటస్థుల చేతుల్లోనే ఉంటాయి. అయిదు శాతం ఓట్లు ఉన్న తటస్తులు ఏ వైపుకు వెళితే ఆ కూటమి లాభపడుతుంది..

మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి ముందు వరకు ఈసారి యూడీఎఫ్‌ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. అందుకు కారణం 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలే! ఆ ఎన్నికల్లో యూడీఎఫ్‌ దాదాపుగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 20 లోకసభ స్థానాలలో యూడీఎఫ్‌కు 19 వచ్చాయి. ఎల్‌డీఎఫ్‌ కేవలం ఒక్కసీటుతోనే సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో పడిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే యూడీఎఫ్‌కు 123 అసెంబ్లీ స్థానాలు రావాలి. సీపీఎంకు 16, బీజేపీకి ఒక సీటు దక్కాలి. విచిత్రంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ బాగా పుంజుకుంది.. ఆ లెక్కన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలి. గత మూడు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.. అధికారంలో ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించిందంటే ఎల్‌డీఎఫ్‌ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అనుకోవాలి. కేరళ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసిన గోల్డ్‌స్కామ్‌ను జనం పెద్దగా పట్టించుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు కూటములకు వచ్చిన ఓటింగ్‌ శాతాన్ని లెక్కిస్తే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు 101 స్థానాలు రావాలి. యూడీఎఫ్‌కు 38 సీట్లు రావాలి. అయితే ప్రీ పోల్‌ సర్వేలు ఎల్‌డీఎఫ్‌ అధికారంలోకి వస్తుందని చెబుతున్నా యూడీఎఫ్‌ గట్టి పోటీని ఇస్తుందని అంటున్నాయి. ఎల్‌డీఎఫ్‌కు 77 స్థానాలు, యూడీఎఫ్‌కు 62 స్థానాలు వస్తాయని సర్వేల సారాంశం. బీజేపీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉందని తెలిపాయి. మరి రెండు నెలల్లోనే యూడీఎఫ్‌ ఎలా బలం పెంచుకోగలిగిందంటే అందుకు కారణం ఊమెన్‌చాందీనే! ఆయన ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ అయిన తర్వాత కాంగ్రెస్‌కు నూతనోత్తేజం వచ్చింది. కాంగ్రెస్‌లో అంతర్గత గొడవలు తగ్గాయి. అందరూ ఏకతాటిపైకి వచ్చారు. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీల బహిరంగసభలు, రోడ్‌షోలు కూడా కలిసివచ్చాయి. ముస్లింలలో మెజారిటీ కాంగ్రెస్‌ పక్షానే ఉన్నారు.

ఎల్‌డీఎఫ్‌ కనుక మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం ఆ క్రెడిట్‌ అంతా పినరయ్‌ విజయన్‌కే దక్కుతుంది. దక్కాలి కూడా! రెండుసార్లు వరదలను కేరళను ముంచెత్తాయి. అప్పుడు విజయన్‌ చేపట్టిన సహాయ కార్యక్రమాలు అందరి ప్రశంసలను అందుకున్నాయి. ఓఖీ తుఫాను వచ్చినప్పుడు కూడా విజయన్‌ వేగంగా స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారు. అలాగే నీఫా వైరస్‌ అప్పుడు కానీ, కరోనా వైరస్‌ అప్పుడు కానీ విజయన్‌ ప్రభుత్వం చాలా బాగా పనిచేసింది.. కరోనా కట్టడికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. వ్యక్తిగతంగా కూడా విజయన్‌కు మంచి పేరు ఉంది. ఉత్తినే మాటలు చెప్పుకండా చేతల్లో పనులు చూపిస్తారని ప్రత్యర్థులు కూడా అంటుంటారు. ప్రభుత్వ ఆఫీసుల్లో టెక్నాలజీని పెంచారు. కరోనా కాలంలో రెండున్నర కోట్ల ఇళ్లకు కిట్స్‌ పంపించారు. 55 లక్షల మందికి నెలకు 16 వందల రూపాయల చొప్పున పెన్షన్‌ అందిస్తున్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో విపక్షాలు నానా యాగి చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

బీజేపీకి వస్తేగిస్తే ఒక సీటు రావచ్చని సర్వేలు అంటున్నాయి. కాకపోతే ఈసారి ఓట్ల శాతాన్ని మాత్రం బాగా పెంచుకుంటుందట! 1981లోనే కేరళలో కాలుపెట్టింది బీజేపీ. అయినా ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపలేదు. గమ్మత్తేమిటంటే దేశంలోనే అత్యధిక ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు అక్కడ ఉండటం. క్రితం సారి బీజేపీ నేమమ్‌లో గెలవడానికి కూడా ఓ కారణం ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజగోపాల్‌ అక్కడ నుంచి పోటీ చేయడంతో కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా పోటీకి దూరమయ్యింది. బలహీనంగా ఉన్న ఎన్‌సీపీకి ఆ సీటు వదిలేసింది. దాంతో ఎల్‌డీఎఫ్‌పై బీజేపీ గెలవగలిగింది. 2014లో పది శాతం ఓట్లు ఉన్న బీజేపీ 2016కు వచ్చేసరికి 15శాతానికి పెంచుకుంది. 2019లో ఇది 16 శాతం అయ్యింది. 2016 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ఈసారి కనీసం పాతిక స్థానాలలో ప్రత్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయబోతున్నది. ప్రజల మదిలో ఏమున్నదో తెలియాలంటే వచ్చే నెల రెండు వరకు ఆగక తప్పదు.. మరిన్ని చదవండి ఇక్కడ : పెద్దపులి వేట అరుదైన దృశ్యాలు! కెమెరాకు చిక్కిన వైల్డ్‌లైఫ్ వీడియో : Tiger Hunting Video. మొసలిపై కూర్చుని నది దాటిన కోడి! మాటు వేసిన మరో మొసలి.. కోడి రాక్.. మొసలి షాక్..: Crocodile and Hen Viral Video.

Follow Us