ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గటం లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన 43 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,930కి చేరింది. వీరాలో 999 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 887 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ముగ్గురు మరణించడంతో కరోనా మరణాలు 44కి చేరాయి. తాజా కేసుల్లో అనంతపురం జిల్లాలో 3, విశాఖపట్నం జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2, చిత్తూరులో 11, కర్నూలులో 6, కృష్ణా జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే, మొదటి నుంచి కరోనా కేసులు అధికంగా గల కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం కేంద్ర వైద్య బృందం కర్నూలుకు చేరుకుంటుంది. ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు ఈ బృందం సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు, నంద్యాల.. తదితర ప్రాంతాలను కేంద్ర బృందం సందర్శించనుంది.. స్టేట్ కోవిడ్ హాస్పిటల్ అయిన కర్నూలు ప్రభుత్వసర్వజన వైద్యశాలను, కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్ను, అక్కడి వైద్యసౌకర్యాలు, పరికరాలను, రోగుల వివరాలను వారు తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే విశ్వభారతి కోవిడ్ హాస్పిటల్, శాంతిరామ్ హాస్పిటల్లను వారు సందర్శించనున్నారు.