టీ సర్కార్ స్వీట్న్యూస్..మామిడి ప్రియులకు మస్తీ
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. మామిడి పండ్ల ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. కరోనా, లాక్డౌన్ పుణ్యమా.. అని ప్రజలు మామిడిపండ్లు కనిపించకుండా పోయాయి. దీంతో చాలా మంది ఈసారి పండ్లను తినలేకపోతున్నామనే నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అది తెలిస్తే మామిడి ప్రియులు నిజంగానే ఎగిరి గంతులు వేస్తారు.
మామిడి పండ్ల ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో అందరికీ కావాలనిపించే మామిడి పండ్లను నేరుగా ఇంటికే సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రసాలు, బంగినపల్లి, మల్గోబా, కలమామిడి ఇలా అన్ని రకాల మామిడి పండ్లనూ ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మామిడి పండ్ల అమ్మకంపై లాక్డౌన్ భారీ ప్రభావమే చూపుతోంది. దీంతో ఫోన్ లో ఆర్డర్ చేస్తే నేరుగా ఇంటికే మామిడి పండ్లను డెలివరీ చేసేందుకు తెలంగాణ ఉద్యానవన శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి ఆర్డర్పై మామిడి పండ్లను సరఫరా చేయనుంది.
కరోనా, లాక్డౌన్ కారణంగా రైతుల నుంచి మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు చేర్చాలని ఉద్యాన శాఖ, ఉద్యాన అభివృద్ధి సంస్థ నిర్ణయించాయి. ఇందుకోసం రైతుల తోటల నుంచే మామిడి కాయలను సేకరించి సహజ పద్ధతిలో మాగబెట్టి కార్టన్ బాక్స్ల్లో 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి పోస్ట్లో పంపనుంది. అయితే, ఈ సౌలభ్యం ప్రస్తుతానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే ఉండనుంది. తర్వాత జిల్లాలకు కూడా కొనసాగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఐదు కిలోల మామిడి పండ్ల ధరను డెలివరీ ఛార్జీలతో కలిపి రూ.350గా నిర్ణయించింది ప్రభుత్వం. ఎన్ని బాక్స్లు కావాలన్నా బుక్ చేసుకోవచ్చని, ఆర్డర్ ఇచ్చిన నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతాయని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు.