AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో ఆర్ధిక మాంద్యం.. చైనా కుయుక్తి.. మన దేశీయ కంపెనీలపై కన్ను.. తిప్పికొట్టిన భారత్

కరోనా రాకాసితో తమ దేశ ఎకానమీ తీవ్రంగా దెబ్బ తినడంతో చైనా మెల్లగా భారత కంపెనీలపై కన్ను వేసింది. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి టేకోవర్ చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నిజానికి ఇలాంటి ఆపదేదో వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించినట్టు ఉన్నారు. గతవారమే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత ఆర్ధిక వ్యవస్థమీద కరోనా చూపుతున్న  ‘దుష్ప్రభావం’  కారణంగా ఇండియాలోని అనేక కంపెనీలు టేకోవర్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయని, ఈ […]

కరోనాతో ఆర్ధిక మాంద్యం.. చైనా కుయుక్తి.. మన దేశీయ  కంపెనీలపై కన్ను.. తిప్పికొట్టిన భారత్
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 18, 2020 | 7:02 PM

Share

కరోనా రాకాసితో తమ దేశ ఎకానమీ తీవ్రంగా దెబ్బ తినడంతో చైనా మెల్లగా భారత కంపెనీలపై కన్ను వేసింది. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి టేకోవర్ చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. నిజానికి ఇలాంటి ఆపదేదో వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించినట్టు ఉన్నారు. గతవారమే ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత ఆర్ధిక వ్యవస్థమీద కరోనా చూపుతున్న  ‘దుష్ప్రభావం’  కారణంగా ఇండియాలోని అనేక కంపెనీలు టేకోవర్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయని, ఈ సంక్షోభ సమయంలో మన దేశంలోని ఏ కార్పొరేట్ సంస్థనైనా విదేశాలు టేకోవర్ చేయకుండా చూడాలని, అలాగే పెట్టుబడులు పెట్టకుండా నియంత్రించాలని ఆయన ట్వీట్ చేశారు. హెచ్ డీ ఎఫ్ సీలో ఒక శాతం వాటాను పెంచుకునేందుకు చైనా సెంట్రల్ బ్యాంకు చేసిన యత్నాన్ని అనేకమంది ఆ సందర్భంగా ఈ ట్వీట్ తో ముడిపెట్టారు. ఈ అంశం సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది. తాజాగా చైనా కుయుక్తులను పసిగట్టిన భారత ప్రభుత్వం చైనా నుంచి ఎలాంటి పెట్టుబడులకు అవకాశం లేకుండా విదేశీ ప్రత్యక్ష  పెట్టుబడుల పాలసీని సవరించింది.. పైగా ఇకపై పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని కూడా స్పష్టం చేసింది. ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడులకు కూడా ఈ సవరణ వర్తిస్తుంది. చైనాయే కాదు.. భారత సరిహద్దులను పంచుకునే అన్ని విదేశాలకూ ఈ విషయంలో ఇక ‘ద్వారాలు మూసుకుపోయినట్టే’ ! విదేశీ పెట్టుబడులన్నీ ముందుగా ప్రభుత్వ అనుమతికి లోబడే ఉండాలని ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ శనివారం ఒక అధికారిక సర్క్యులర్  జారీ చేసింది.

అలాగే ప్రస్తుత లేదా.. భవిష్యత్ విదేశీ పెట్టుబడులకు తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలన్నది ఈ సర్క్యులర్ ఉద్దేశం. చైనా, హాంకాంగ్ దేశాల్లోని ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమకు ప్రయోజనం కలిగించే ‘ఓనర్ల’ వివరాలు ఏవైనా ఉంటే వాటిని తెలియజేయాల్సిందిగా కస్టోడియన్ బ్యాంకులను ‘సెబీ ‘ కోరడం ఈ సందర్భంగా గమనార్హం. 2017 లో ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డును ప్రభుత్వం రద్దు చేసి.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కవాటాలు తెరుస్తూ వచ్చింది. ఈ అవకాశాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంది.

ఏమైనా.. టేకోవర్ భయాలు తీవ్రం కావడంతో ముఖ్యంగా  ఇండియాలో చైనా పెట్టుబడులు ప్రభుత్వ నిఘా (విజిలెన్స్) కిందికి వస్తాయని ‘నాంగియా యాండర్ సెన్’..ఎల్ ఎల్ పీ డైరెక్టర్ సందీప్ తెలిపారు. ఇండియన్ స్టార్టప్స్ లో చైనా టెక్ ఇన్వెస్టర్లు సుమారు 4 బిలియన్ల గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్ మెంట్లు పెట్టారు. కానీ వీటిపై ఈ తరుణంలో డేగ కన్ను తప్పనిసరి. విదేశీ ఎక్స్ చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కొత్త నిబంధనలు నోటిఫికేషన్ జారీ అయినా తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

Follow Us