AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించానిలా…తొలి బాధితుడి అనుభవాలు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌​ బారిన పడిన తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నారు. 14 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆ వ్యక్తి ..మీడియాతో మాట్లాడారు. చికిత్స సమయంలోని అనుభవాలను పంచుకున్నారు...

కరోనాను జయించానిలా...తొలి బాధితుడి అనుభవాలు
Jyothi Gadda
|

Updated on: Mar 16, 2020 | 12:08 PM

Share

కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలపై బడి విలయతాండవం చేస్తోంది. ఎక్కడో చైనాలోని వుహన్‌ పట్టణంలో పుట్టిన వైరస్..దాదాపు 157 దేశాలకు విస్తరించి ప్రజల ప్రాణాలు హరింపజేస్తోంది. భారత్‌లోనూ కొవిడ్-19 భూతం అంతకంతకు తన ఉనికిని చాటుకుంటోంది. ఈ క్రమంలోనే వైరస్ భయాందోళన నుంచి ఉపశమనం కలిగించే విషయం ఒకటి వెలుగుచూసింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌​ బారిన పడిన తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నారు. 14 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆ వ్యక్తి ..మీడియాతో మాట్లాడారు. చికిత్స సమయంలోని అనుభవాలను పంచుకున్నారు.

ఢిల్లీలో నమోదైన మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు..రోహిత్ దత్తా… కరోనాను జయించారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో గత రెండు వారాలుగా చికిత్స పొందుతున్న45 ఏళ్ల రోహిత్ దత్త ఆదివారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. తనకు వైద్యసేవలు అందించిన వైద్యులు, వైద్యసిబ్బందిని ప్రశంసించారు. తనకు చికిత్స అందించిన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు లగ్జరీ హోటల్‌లా ఉందని, వార్డును సిబ్బంది అత్యంత శుభ్రంగా ఉంచారని, బెడ్ పై దుప్పట్లను కూడా రోజుకు రెండు సార్లు మార్చారని రోహిత్ దత్తా చెప్పారు. ఐసోలేషన్ వార్డులో నుంచి తాను కుటుంబసభ్యులతో వీడియో కాల్ చేసుకునేందుకు, చూడటానికి నెట్ ఫ్లిక్స్ సౌకర్యం కల్పించారని, దీనివల్ల 14 రోజుల పాటు తాను ఐసోలేషన్ గదిలో ఉన్నా, తాను ఒంటరిగా భావించలేదని రోహిత్ దత్తా వ్యాఖ్యానించారు. తాను ఐసోలేషన్ గదిలోనే రోజుకు రెండుసార్లు ప్రాణాయామం చేశానని ఆయన పేర్కొన్నారు.

ఇటలీ దేశంలో జరిగిన లెదర్ ఎగ్జిబిషన్ లో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చిన రోహిత్ దత్తాకు కరోనా వైరస్ సోకింది. ఫిబ్రవరి 25వతేదీన యూరప్ నుంచి ఢిల్లీకి తిరిగివచ్చాక జ్వరం రావడంతో భయపడి తాను సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించి 30 నిమిషాల్లోనే ఐసోలేషన్ వార్డుకు తరలించారని రోహిత్ చెప్పారు. వైద్య సేవలపై కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పడు పర్యవేక్షణ నిర్వహించారని చెప్పారు. తనకు వచ్చిన కరోనా వైరస్ వ్యాధిని నివారించడానికి కృషి చేసిన వైద్యాధికారులను అభినందించారు రోహిత్ దత్తా.