రాజధానిలో హోం క్వారంటైన్ కొత్త మార్గదర్శకాలు
భారత్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశంలో ముఖ్యంగా మూడు రాష్ట్రాలను వైరస్ వణికిస్తోంది. రోజుకు అత్యధిక కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో ఉన్న తమిళనాడును ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీ దాటేసింది. ఈ క్రమంలో సీఎం హోం క్వారంటైన్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.

భారత్లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశంలో ముఖ్యంగా మూడు రాష్ట్రాలను వైరస్ వణికిస్తోంది. రోజుకు అత్యధిక కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా, ఆ తరువాతి స్థానంలో ఉన్న తమిళనాడును ఇప్పుడు దేశరాజధాని ఢిల్లీ దాటేసింది. దేశంలోనే ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న కోవిడ్ కేసులతో ఢిల్లీ రెండో స్థానంలోకి చేరింది. ఓ వైపు అత్యంత వేగంగా పెరుగుతున్న కేసుల సంఖ్య.. మరోవైపు బెడ్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ హోం క్వారంటైన్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.
ప్రభుత్వ సూచన మేరకు… ఇక మీదట ఎవరికైనా రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే.. వారు సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యుడిని కలవాలని చెప్పారు. ఆ రిపోర్టులు చూసిన తర్వాత వైరస్ తీవ్రతను బట్టి సదరు వ్యక్తికి హోం క్వారంటైన్ సరిపోతుందా.. లేక కోవిడ్ కేర్ సెంటర్కి వెళ్లాలా అనే విషయాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. సదరు వ్యక్తిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఏవి లేకుండా.. కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉంటే బాధిత వ్యక్తికి హోం క్వారంటైన్ను సూచిస్తారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వారిని ఆస్పత్రికి లేదా కరోనా కేర్ సెంటర్కి తరలించే విధంగా కీలక నిర్ణయం ప్రకటించారు. మరోవైపు, కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న వారిని హోం క్వారంటైన్కు సిఫారసు చేసే ముందు ఓ ప్రత్యేక బృందం వారి ఇంటిని పరిశీలిస్తుందని చెప్పారు. ఇంట్లో రెండు గదులు.. ప్రత్యేక టాయిలెట్ ఉంటేనే ఆ ఇల్లు హోం క్వారంటైన్కు సరిపోతుందని సూచిస్తారు. లేదంటే వారిని కరోనా కేర్ సెంటర్కు పంపించాలని చెప్పారు.
హోం క్వారంటైన్లో ఉన్న కేసులను ప్రత్యేక బృందం తొమ్మిది రోజుల పాటు పర్యవేక్షిస్తుందని, ప్రతి రోజు ఫోన్ చేసి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకుంటుందని తెలిపారు. పది రోజుల తర్వాత వారిని డిశ్చార్జ్ చేస్తారని స్పష్టం చేశారు. ఇళ్లల్లో వసతులు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు లేనివారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకోవచ్చని తెలిపారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. హోం ఐసోలేషన్లో ఉండే వారందరికీ పల్స్ ఆక్సీ మీటర్లు ఇస్తామని సీఎం తెలిపారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలవడానికి ఈ ఆక్సిమీటర్ సహాయపడుతుంది. కాబట్టి రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రాకముందే ఆక్సిజన్ను అభ్యర్థించవచ్చు’ అని తెలిపారు.




