ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం కోల్పోయినట్లేనా..? క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు!
ఓటరు జాబితాలో పేరు లేకపోవడం వల్ల ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించే అంతిమ అధికారం భారత ఎన్నికల సంఘానికి లేదని తేల్చి చెప్పింది.

ఓటరు జాబితాలో పేరు లేకపోవడం వల్ల ఎవరూ పౌరసత్వాన్ని కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించే అంతిమ అధికారం భారత ఎన్నికల సంఘానికి లేదని తేల్చి చెప్పింది. ఓటర్ల జాబితా నుండి తొలగించినంత మాత్రాన పౌరసత్వాన్ని కోల్పోరని బీహార్ SIR తీర్పులోనే తాము స్పష్టం చేశామని కోర్టు పేర్కొంది. SIR నుండి మినహాయించిన వ్యక్తుల అప్పీళ్లను విచారించడానికి ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునళ్లలో విచారణ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని కోరుతూ ప్రసేన్జిత్ బోస్ దాఖలు చేసిన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.
పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారం ఈసీకి లేదుః సుప్రీం
ఒక వ్యక్తి భారత పౌరుడా? కాదా? అని నిర్ధారించే తుది అధికారం ఈసీకి లేదని, ఓటరు జాబితాలో పేరు లేకపోవడం అనేది కేవలం ఆ వ్యక్తికి ఓటు హక్కు లేదని మాత్రమే సూచిస్తుంది. అంతేతప్ప, అది పౌరసత్వాన్ని రద్దు చేసే పత్రం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగింపు వల్ల పౌరసత్వం పోతుందని, దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, తప్పుగా పేర్లు తొలగింపునకు గురైన వారి కోసం సరైన అప్పీల్ వ్యవస్థ ఉండాలని కోర్టు సూచించింది. ఎన్నికల ప్రక్రియ కోసం ఈసీ చేసే వెరిఫికేషన్ కేవలం జాబితా తయారీకి మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది.
ఓటు లేని వారికి సంక్షేమ పథకాలు కట్!
బెంగాల్ లో ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కోల్పోయిన వారు 19 అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ముందు 34 లక్షల అప్పీళ్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.. ఇప్పటివరకు చాలా తక్కువ అప్పీళ్లు సుమారు 38,000 మాత్రమే పరిష్కరించారు. వాటిలో కనీసం 70 శాతం అప్పీళ్లు అనుమతించారు. అప్పీళ్లు పెండింగ్లో ఉండగానే, ఓటర్ల జాబితా నుండి తొలగించిన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద ప్రయోజనాలను, అన్నపూర్ణ యోజన వంటి సంక్షేమ పథకాలను నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆ వ్యక్తులకు కుల ధృవీకరణ పత్రాలను కూడా నిరాకరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకి తెలిపారు.
ఈ సందర్భంగా ఒక వ్యక్తిని ఓటర్ల జాబితా నుండి తొలగించిన తర్వాత, వారి పౌరసత్వ స్థితిని నిర్ధారించడానికి కేంద్రానికి దరఖాస్తు చేసుకోవడం ఈసీఐ విధి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తున్నారన్న పిటిషన్ ను విచారణ జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
