పరగడుపున నాలుగు మారేడు ఆకులు నమిలి తింటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
August 06
Jyothi Gadda
ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద వైద్యంలో కూడా మారేడు ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మారేడు ఆకులలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి.
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు శుభ్రమైన మారేడు ఆకులను నమిలి తినడం లేదా వాటి రసాన్ని తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహంతో బాధపడేవారికి మారేడు ఆకులు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడతాయి.
మారేడు ఆకులలో ఫైబర్, శోథ నిరోధక గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపులో అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. కడుపులో ఏర్పడే అల్సర్లను నయం చేయడంలో ఇవి అద్భుతంగా తోడ్పడతాయి.
ఈ ఆకులలో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచడానికి, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
మారేడు ఆకుల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని నమలడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఇది జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా రక్షణ ఇస్తుంది.
మారేడు ఆకులు శరీరంలోని, రక్తంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎలా ఉపయోగించాలి?: రెండు లేదా మూడు లేత మారేడు ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి ఉదయాన్నే నమిలి మింగవచ్చు. లేదా ఆకులను దంచి, కొద్దిగా నీటిలో కలిపి రసంలా చేసి తాగవచ్చు.