మన వంటగదిలో దొరికే వస్తువులు పసుపు, పెరుగుతో సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు..దీంతో ముఖానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పసుపులో యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి.
పసుపును పెరుగుతో కలిపి క్రమం తప్పకుండా రాయడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా, వాటి వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు క్రమంగా మాయమవుతాయి.
పెరుగులో ఆరోగ్యకరమైన కొవ్వులు, లాక్టిక్ యాసిడ్ ఉంటాయి. ఇది చర్మానికి ఒక అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ ఒక వరం లాంటిది.
ఇది చర్మం పొరల్లోకి చొచ్చుకుపోయి అవసరమైన తేమను అందిస్తుంది, తద్వారా చర్మం పొడిబారకుండా మృదువుగా మారుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది.
ఎండ వల్ల ముఖంపై వచ్చే ట్యాన్, ముడతలను తొలగించి, చర్మ రంగును మెరుగుపరచడంలో ఈ మిశ్రమం గ్రేట్గా సహాయపడుతుంది. చిన్నవయసులోనే వచ్చే వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది.
పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ రాకుండా అడ్డుకుంటాయి. పెరుగు, పసుపు ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం సాగే గుణం మెరుగై, ముఖం ఎల్లప్పుడూ కాంతితో, యవ్వనంగా కనిపిస్తుంది.
ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా గట్టి పెరుగును తీసుకుని, అందులో పావు చెంచా ప్యూర్ పసుపు (వీలైతే కస్తూరి పసుపు) వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల మీ ముఖంపై సహజమైన గ్లో రావడం మీరే గమనిస్తారు!