శ్రీశైలంపై తెలంగాణకు హక్కులేదు..వెనక్కి తగ్గేది లేదంటున్న బీజేపీ !?
ఏపీ భూభాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఏపీకే చెందుతుందని, దానిపై తెలంగాణకు ఎలాంటి హక్కులుండవని చెప్పుకొచ్చారు. దీనిపై పోరాటమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ వాటర్ వార్ రాజుకుంటోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ భగ్గుమంటోంది. ఇప్పటికే దీనిపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాలకు చెందిన కెఆర్ఎంబి సభ్యులు, అంతరాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల సమక్షంలో సమస్యను తెలుసుకుని స్పందించేందుకు ఆన్లైన్ విచారణ చేపట్టింది. అయితే, ఏపీ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేతలు స్వాగతిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పరంగానే కాకుండా పోతిరెడ్డి పాడు పంచాయతీ రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ఇప్పటికే దీనిపై పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఏపీకి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ భూభాగంలో ఉందని.. ఆ ప్రాజెక్టుపై తెలంగాణకు ఎలాంటి హక్కులు లేవని అన్నారు. జీవో నెంబర్ 203 విషయంలో తెలంగాణ మూర్ఖంగా వ్యవహరించవద్దని..అలా జరిగితే తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టు కూడా చట్ట విరుద్ధమేనని ఆరోపించారు టీజీ. ఏపీ భూభాగంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఏపీకే చెందుతుందని స్పష్టం చేశారు. దానిపై తెలంగాణకు ఎలాంటి హక్కులుండవని చెప్పుకొచ్చారు. దీనిపై పోరాటమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు టీజీ వెంకటేష్. జీవో నెంబర్ 203 విషయంలో జగన్ వెనక్కి తగ్గొద్దని.. అవసరమైతే బీజేపీ తరపున తాను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.