ఏపీ హైకోర్టుకు కరోనా ఎఫెక్ట్..సెలవుల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది..
ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జారీ చేసిన కరోనా సెలవులను పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన జారీ చేసిన ప్రకటనను సవరిస్తూ గురువారం మరో నోటిఫికేషన్లో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కోర్టుల కార్యకలాపాలను నిలిపివేయాలని ఏపీ హై కోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్ కోర్టు ఇటీవల కరోనా వ్యాప్తి నియంత్రణపై కూలంకషంగా చర్చించి ఈ నెల 31వ తేదీ వరకు హై కోర్టుతో పాటు దిగువ న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, న్యాయసేవాధికార సంస్థ తదితరాల కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ సెలవులను పొడిగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ నోటిఫికేషన్ వెలువరించారు. అయితే, చీఫ్ జస్టిస్ అనుమతితో అత్యవసర కేసులపై మాత్రం విచారణ జరపనున్నారు. అత్యంత అవసరం ఉన్న కేసుల విచారణ జరిపేందుకు ఇటీవల ప్రకటించిన తేదీలను కూడా హైకోర్టు రద్దు చేసింది.