AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాల “ఈ పార్లమెంట్ ” సమావేశాలు

రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు వర్చువల్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ మధ్య చర్చలు జరిగాయి.

వర్షాకాల ఈ పార్లమెంట్  సమావేశాలు
Balaraju Goud
|

Updated on: Jun 02, 2020 | 7:46 AM

Share

రానున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు వర్చువల్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్ మధ్య చర్చలు జరిగాయి. రాజధాని ఢిల్లీతోసహా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్ని ఎలా నిర్వహించాలన్న అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వైరస్‌ వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను వర్చువల్‌ సాంకేతికత సాయంతో ‘ఈ-పార్లమెంట్‌’ను నిర్వహించాలని భావిస్తోంది. ఇదే అంశంపై రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో సాధారణ సమావేశాలు సాధ్యంకాకపోవచ్చని, వర్చువల్ సాంకేతికతను ఉపయోగించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. మరోవైపు సభ్యుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లోనే రెండు సభల్ని రోజు విడిచి రోజు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా రాజ్యసభ చైర్మన్‌, లోక్సభ స్పీకర్‌ భేటీలో చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వర్చువల్ ద్వారా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న లేదా భౌతిక దూరంపాటిస్తూ సాధారణ సమావేశాల మాదిరిగానే నిర్వహించాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. జూలై, ఆగస్టు నెలలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండటంతో త్వరలోనే దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.