
హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 29వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరుకావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ పరీక్షల్లో తప్పిన కొందరు విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరైతే.. మరికొందరేమో మార్కులను పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాశారు. దీంతో ఇంటర్ సప్లిమెంటరీలో విద్యార్ధుల సంఖ్య భారీగా పెరిగింది.
ఇప్పటికే ఈ పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ కూడా ముగిసింది. ఇక ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల ఫలితాలకు సంబంధించి ప్రకటన జారీ చేసింది. ఇంటర్ బోర్డు తాజా ప్రకటన మేరకు జూన్ 16న సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం (జూన్ 16) మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెల్లడైన తర్వాత అధికారిక వెబ్సైట్తో పాటు టీవీ9 తెలుగు వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి మే 29 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 4.2లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 892 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 29 నుంచి మొదటి విడత మూల్యాంకనం, మే 31 నుంచి రెండో విడత మూల్యాంకనం.. చేపట్టారు. జోసా కౌన్సెలింగ్, ఈఏపీసెట్, నీట్ వంటి ప్రవేశాలకు ఇంటర్ మార్కులు కీలకం కానుండటంతో విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.