AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజినీరింగ్‌ విద్యార్ధులకు భారీ ఊరట.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఊరట కలిగించేలా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజులు వసూలు చేయకుండా కళాశాలలు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది..

ఇంజినీరింగ్‌ విద్యార్ధులకు భారీ ఊరట.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
High Court Fresh Guidelines On Engineering Fee Reimbursement
Srilakshmi C
|

Updated on: Jul 10, 2026 | 5:29 PM

Share

హైదరాబాద్‌, జులై 10: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థుల ఫీజులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే కళాశాలలు విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజులు వసూలు చేయకుండా అడ్మిషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై ప్రభుత్వం ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తైన తర్వాత జులై 31లోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఖాతాల్లో ఆగస్టు 15లోగా ఫీజు మొత్తాలు జమ చేయాలని ఆదేశించింది. అనంతరం విద్యార్థులు ఆయా కళాశాలలకు ఫీజులను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఇక రెండో, మూడో, నాలుగో సంవత్సరం విద్యార్థుల ఫీజుల చెల్లింపుల విషయంలోనూ ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో, వారు ఈ నెల 15లోపు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని, 29లోగా వారి ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ చేయాలని కోర్టు ఆదేశించింది. విద్యార్థుల వివరాలను ఈ నెల 13లోపు సమర్పించాలని ప్రభుత్వం పేర్కొనగా, అందిన దరఖాస్తుల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించిన తర్వాత 14 రోజుల్లోగా ఫీజు మొత్తాలను విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి, ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారమే విద్యార్థుల ఖాతాల ద్వారా ఫీజుల చెల్లింపు విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించిన హైకోర్టు, తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. ఈ నిర్ణయం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడే వేలాది మంది విద్యార్థులకు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.

Follow Us