Degree Courses: డిగ్రీ కాలేజీల్లో 25 శాతం ప్రవేశాలు లేకుంటే ఆ కోర్సు రద్దు.. పని గంటల ఆధారంగా అధ్యాపకుల క్రమబద్ధీకరణ
డిగ్రీలో తీసుకొచ్చిన సింగిల్ మేజర్తో చాలా కోర్సులు మూతపడే పరిస్థితి దాపురించింది. దీంతె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉన్న కోర్సుల్లో 25 శాతం ప్రవేశాలు లేకపోతే వాటిని రద్దుచేయనున్నాయి. ఆయా కాలేజీల్లో ఉండే అధ్యాపకులను వేరేచోట్ల సర్దుబాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో అధ్యాపక పోస్టుల సంఖ్య తగ్గనుంది. అనేక కాలేజీల్లో ఫిజిక్స్ కోర్సులో చేరికలు తక్కువగా ఉంటాయి. అది మేజర్..

హైదరాబాద్, అక్టోబర్ 31: డిగ్రీలో తీసుకొచ్చిన సింగిల్ మేజర్తో చాలా కోర్సులు మూతపడే పరిస్థితి దాపురించింది. దీంతె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉన్న కోర్సుల్లో 25 శాతం ప్రవేశాలు లేకపోతే వాటిని రద్దుచేయనున్నాయి. ఆయా కాలేజీల్లో ఉండే అధ్యాపకులను వేరేచోట్ల సర్దుబాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో అధ్యాపక పోస్టుల సంఖ్య తగ్గనుంది. అనేక కాలేజీల్లో ఫిజిక్స్ కోర్సులో చేరికలు తక్కువగా ఉంటాయి. అది మేజర్ కోర్సు అయినప్పటికీ కొన్ని కాలేజీల్లో సున్నా ప్రవేశాలున్నాయి. ఆర్ట్స్ కోర్సుల్లో సెక్షన్కు 40, సైన్సు కోర్సుల్లో 60 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన ప్రభుత్వం పెట్టింది.
మేజర్ సబ్జెక్టుల్లో ప్రవేశాల ఆధారంగా అధ్యాపకులను ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఇటీవలే డిగ్రీ అధ్యాపకులకు బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరుతో పోస్టులను మార్చితే దూరం వెళ్లాల్సి వస్తుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ నిబంధన ప్రకారం డిగ్రీ అధ్యాపకుడికి వారానికి 16 గంటలు బోధన పని గంటలు తప్పనిసరిగా ఉండాలి. అయితే రాష్ట్ర కళాశాల విద్యాశాఖ దీనిని పట్టించుకోకుండా హేతుబద్ధీకరణ చేపట్టిందని అధ్యాపకులు వాపోతున్నారు. ఇప్పటికే కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పనిభారం గురించిన నివేదిక ప్రభుత్వం సేకరించింది. వీటిపై ఆర్జేడీలు కసరత్తు చేసి, కమిషనరేట్కు తుది నివేదిక పంపనున్నారు
ఆకోర్సులన్నీ కౌన్సెలింగ్లోనే సర్దుబాటు..
ఇక 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు తక్కువగా నమోదయ్యాయి. సెక్షన్లో కనీసం 25 శాతం ప్రవేశాలు ఉండాలనే నిబంధన పెట్టడం, మేజర్ సబ్జెక్టు పని గంటలను లెక్కించడంతో అధ్యాపకుల పని కొరత కనిపిస్తోంది. సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంలో రెండో ఏడాది నుంచి మైనర్ సబ్జెక్టులు ఉంటాయి. ఈ ఏడాది నుంచే ఈ విధానం మొదలైనందున వచ్చే సంవత్సరం మైనర్ సబ్జెక్టులు వస్తాయి. అయితే అధికారులు మాత్రం మైనర్ సబ్జెక్టులను పట్టించుకోకుండా మేజర్ సబ్జెక్టుల పని గంటల ఆధారంగా మాత్రమే అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తున్నారు. అలాగే మేజర్, మైనర్తోపాటు నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు కూడా ఉన్నాయి. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
25 శాతంలోపు ప్రవేశాలున్న కోర్సుల్లోని విద్యార్థులను ఇప్పటికే వేరే కాలేజీలు, వేరే కోర్సులకు సర్దుబాటు చేశారు కూడా. కౌన్సెలింగ్ సమయంలోనే ఐచ్ఛికాలు మార్చుకోవాలంటూ విద్యార్ధులకు సూచించారు. దీంతో చాలామంది వారికి నచ్చిన కోర్సు కోసం ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. కొందరు మాత్రం అదే కాలేజీలో చదివేందుకు కోర్సులు మార్చుకున్నారు. డిగ్రీలో చేరిన వారిలో ఎక్కువమంది సైన్సు సబ్జెక్టుల్లోనే ఉంటున్నారు. అక్కడ కూడా సెక్షన్కు 60 మంది విద్యార్ధులు ఉండటంతో వారికి పని గంటలు తక్కువగా వస్తున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.