NEET PG 2025 Revised Exam Date: నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీ ఇదే.. సుప్రీంకోర్టు అనుమతి కోరుతూ NBEMS పిటిషన్
జూన్ 15న నిర్వహించవల్సిన నీట్ పీజీ 2025 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ఇటీవల ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం సాధ్యంకాదని, అందుకు పరీక్ష కేంద్రాల సంఖ్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాలనూ భారీగా పెంచాల్సి ఉంటుందని..

హైదరాబాద్, జూన్ 4: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ 2025 పరీక్షను నిర్వహించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 15న నిర్వహించవల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ఇటీవల ప్రకటన జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించడం సాధ్యంకాదని, అందుకు పరీక్ష కేంద్రాల సంఖ్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాలనూ భారీగా పెంచాల్సి ఉంటుందని ఎన్బీఈ పేర్కొంది. అందుకు మరింత సమయం అవసరం అవుతుందని, అందుకే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు విన్నవించింది. కొత్త పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తన ప్రకటనలో పేర్కొంది.
తాజాగా కొత్త పరీక్ష తేదీని నిర్ణయించిన నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ).. నీట్-పీజీ-2025 పరీక్షను జూన్ 15 నుంచి ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసేందుకు అనుమతి కోరుతూ మంగళవారం (జూన్ 3) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్టు 3వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్టులో నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్బీఈ తన పిటిషన్లో తెలియచేసింది. నిర్వహణకు సాంకేతిక భాగస్వామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ఆగస్టు 3వ తేదీని సూచించినట్లు ఎన్బీఈ తన పిటిషన్లో వివరించింది. ఈ తేదీన పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎన్బీఈ సుప్రీంకోర్టును కోరింది.
కాగా రెండు షిఫ్టులలో కాకుండా దేశవ్యాప్తంగా ఒకేషిఫ్టులో నీట్ పీజీ 2025 పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా జూన్ 15న నిర్వహించాల్సిన నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ఎన్బీఈ తెలిపింది. ఒకే షిఫ్ట్లో నీట్ పీజీని నిర్వహించడం ద్వారా నిష్పాక్షికత, ఏకరూపత అవసరాన్ని నొక్కి చెబుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయడం జరిగింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








