తరగతి గదిలో 2వ తరగతి బాలుడిని బంధించి.. ఇంటికెళ్లిన టీచర్! మర్నాడే సస్పెండ్ వేటు
ఓ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి విద్యార్థి పొరపాటున తరగతి గదిలోనే ఉండిపోవడంతో తలుపులు వేసి సిబ్బంది వెళ్లిపోయారు. చిన్నారి కిటికీలో నుంచి ఏడుస్తూ కనిపించడంతో గ్రామస్తులు సమాచారం అందించారు. ఘటనపై విచారణ అనంతరం నిర్లక్ష్యానికి బాధ్యురాలిగా గుర్తించిన టీచర్ ను అధికారులు సస్పెండ్ చేశారు..

జౌన్పూర్, జులై 20: రెండో తరగతి చదువుతున్న విద్యార్థి పొరపాటున తరగతి గదిలోనే ఉండిపోయాడు. స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత గమనించని సిబ్బంది తలుపులు వేసి వెళ్లిపోయారు. అయితే విద్యార్ధి ఏడుపు పాఠశాల నుంచి వినిపించడంతో గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఓ ప్రభత్వ ప్రాథమిక పాఠశాలలో గత శుక్రవారం (జులై 17) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా సిర్కోని బ్లాక్ పరిధిలోని పరియాన్వ్ గ్రామ పంచాయతీకి చెందిన బన్పుర్వా ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో గత శుక్రవారం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులంతా వెళ్లిపోయారని భావించిన సిబ్బంది.. గదులకు తాళాలు వేశారు. అయితే రెండో తరగతికి చెందిన ఓ విద్యార్థి తరగతి గదిలోనే ఉన్న విషయాన్ని గమనించకుండా తాళం వేసి అంతా వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత తరగతి గది కిటికీలో నుంచి చిన్నారి ఏడుస్తూ ఉండటం స్థానికులు గమనించారు. వెంటనే గ్రామస్తులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది సుమారు గంటన్నర తర్వాత తిరిగి వచ్చి తలుపులు తెరిచి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు కూడా పాఠశాలకు చేరుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. జిల్లా ప్రాథమిక విద్యాధికారి సమీర్ ఘటనపై విచారణకు ఆదేశించారు. ముంగ్రా బాద్షాహ్పూర్ బ్లాక్ విద్యాధికారిని విచారణ అధికారిగా నియమించారు. విచారణలో విద్యార్థి తరగతి గదిలో బంధించినట్లు నిర్ధారణ అయింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టీచర్ కృష్ణ కుమారిని బాధ్యురాలిగా గుర్తించారు. దీంతో ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో కృష్ణ కుమారిని పరియాన్వ్లోని అప్పర్ ప్రైమరీ స్కూల్కు అనుబంధంగా నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణను నిష్పక్షపాతంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.




