తరగతి గదిలో అధ్యాపకుడు.. బయట క్యాబ్ డ్రైవర్.. వైరల్గా మారిన PhD ప్రొఫెసర్ బతుకుపోరు!
చెన్నైలోని ఓ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ ఈ. తిరుమలై రాజా, కుటుంబ పోషణ కోసం కళాశాల సమయం తర్వాత క్యాబ్ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు. పీహెచ్డీతో పాటు పలు ఉన్నత విద్యార్హతలు, పరిశోధనా అనుభవం ఉన్నప్పటికీ శాశ్వత ఉద్యోగం దక్కకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది..

చెన్నై, జులై 16: ఉన్నత విద్యార్హతలు, పరిశోధనా పత్రాలు, ఎన్నో యేళ్ల బోధనా అనుభవం, జాతీయ-అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడం.. ఇన్ని క్వాలిఫికేషన్లు ఉంటే సాధారణంగా ఏదైనా ఎవరికైనా హారతి ఇచ్చి మరీ ఉద్యోగం ఇస్తారు. కానీ చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న డాక్టర్ ఈ. తిరుమలై రాజా పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. కుటుంబాన్ని పోషించేందుకు ఆయన కాలేజీ విధులు ముగిసిన తర్వాత క్యాబ్ డ్రైవర్గా కూడా పనిచేస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ తిరుమలై రాజా కథను భారతీయ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) సీనియర్ అధికారి అనంత్ రూపనగుడి ‘ఎక్స్’లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఇంతకీ పీహెచ్డీ చదివి క్యాబ్ డ్రైవర్గా మారిన సదరు డాక్టర్ తిరుమలై రాజా కష్టాలేమిటో మనమూ తెలుసుకుందాం..
డాక్టర్ తిరుమలై రాజా విద్యా ప్రస్థానం ఎంతో విశిష్టమైనది. రాజా ఇంగ్లీష్ లిటరేచర్లో పీహెచ్డీ, ఎంఫిల్, ఎంఏ పూర్తి చేయడంతో పాటు సైకాలజీలో ఎంఎస్సీ, బీఈడ్, డిప్లొమా ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ (DTEd) వంటి పలు ఉన్నత విద్యార్హతలను సంపాదించారు. రాజా డాక్టరేట్ పరిశోధన ‘ఇండో-ఆంగ్లియన్ రచనల్లో బ్లాక్ హ్యూమర్’ అంశంపై సాగింది. ఇప్పటివరకు యూజీసీ గుర్తింపు పొందిన జర్నల్స్లో అనేక పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఆయన, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పలు రీసెర్చ్ పేపర్లు సైతం సమర్పించాడు. తమిళనాడులోని అనేక కళాశాలలు, విద్యాసంస్థల్లో అతిథి ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. బోధనతో పాటు డాక్టర్ రాజా అనేక విద్యా, పరిపాలనా బాధ్యతలు నిర్వహించారు. ఐక్యూఏసీ (IQAC) కోఆర్డినేటర్, పరీక్షల విభాగం కోఆర్డినేటర్, ఫిర్యాదుల పరిష్కార కమిటీ కోఆర్డినేటర్, వెబ్సైట్ కమిటీ కోఆర్డినేటర్గా పనిచేశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల కోసం ప్రశ్నాపత్రాల రూపకర్తగా కూడా సేవలందించారు. అంతేకాకుండా సంపాదకుడు, మోటివేషనల్ స్పీకర్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా పనిచేయడంతో పాటు యూత్ రెడ్ క్రాస్, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించారు.
అయినా దక్కని శాశ్వత ఉద్యోగం
ఇన్ని అర్హతలు, అనుభవం ఉన్నప్పటికీ డాక్టర్ రాజాకు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత టీచర్ ఉద్యోగం లభించలేదు. గతంలో నమక్కల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన నెలకు సుమారు రూ.20 వేల వేతనం పొందేవాడు. ప్రస్తుతం చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తూ నెలకు సుమారు రూ.30 వేల వేతనం అందుకుంటున్నాడు. అయితే ఆ ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో అదనపు ఉపాధి కోసం క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నమక్కల్లో ఉంటే.. ఉద్యోగ రీత్యా రాజా మాత్రం చెన్నైలో నివసిస్తున్నాడు. కుటుంబ ఖర్చులు, పిల్లల చదువుల కోసం ఖాళీ సమయాల్లో కాల్ ట్యాక్సీ నడుపుతున్నాడు.
విద్యావేత్తల పరిస్థితిపై మళ్లీ చర్చ
డాక్టర్ రాజా కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేలాది మంది స్పందిస్తున్నారు. ఇంతటి విద్యార్హతలు, అనుభవం ఉన్న వ్యక్తి జీవనోపాధి కోసం అదనపు ఉద్యోగం చేయాల్సి రావడం విద్యా రంగంలో ఉన్న సమస్యలను వెలుగులోకి తెచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వేలాది మంది అధ్యాపకులు తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. డాక్టర్ తిరుమలై రాజా కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులపై మరోసారి చర్చకు దారితీసింది.
