పదో తరగతి సర్టిఫికెట్లకు డిజిటల్ టచ్.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు!
రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు ఇకపై మరింత ఆధునికంగా మారనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీ చేసే మెమోలపై QR కోడ్ను ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల టెన్త్ సర్టిఫికెట్లపై ముద్రించే QR కోడ్ను..

అమరావతి, సెప్టెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్లు ఇకపై మరింత ఆధునికంగా మారనున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీ చేసే మెమోలపై QR కోడ్ను ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల టెన్త్ సర్టిఫికెట్లపై ముద్రించే QR కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే సంబంధిత విద్యార్థి మార్కుల వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించనున్నారు. QR కోడ్ ద్వారా విద్యార్థుల మార్కుల సమాచారాన్ని సులభంగా పరిశీలించేందుకు వీలుగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
స్కాన్ చేస్తే మార్కుల వివరాలు
టెన్త్ మెమోపై ఉండే QR కోడ్ను మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే అది RTGSకు కనెక్ట్ అవుతుందని అధికారులు తెలిపారు. అక్కడ విద్యార్థికి సంబంధించిన పదో తరగతి మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో సర్టిఫికెట్ వివరాలను త్వరగా ధ్రువీకరించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో విద్యార్థులకు జారీ చేసిన హాల్టికెట్లపై కూడా QR కోడ్ను ముద్రించారు. పరీక్ష కేంద్రాలను విద్యార్థులు సులభంగా గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడింది.
ఇదే తరహాలో ఇప్పుడు పదో తరగతి మెమోలపై QR కోడ్ను ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2025-26 విద్యా సంవత్సరంలో టెన్త్ పాసైన విద్యార్థుల సర్టిఫికెట్లతో ఈ విధానం అమల్లోకి రానుంది.




