Andhra Pradesh: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో 14వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల నియామకం పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Andhra Pradesh: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలో 14వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
Andhra CM Jagan Mohan Reddy

Updated on: Jan 22, 2023 | 12:38 PM

AP Grama – Ward Sachivalayam 2023 Jobs: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాల నియామకం పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్‌ జారీకి జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో జగన్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతా సజావుగా జరిగితే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 14,523 ఉద్యోగాల‌కు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీకి చర్యలు చేపట్టారు. 2019 జూలై – అక్టోబర్‌ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రక్రియను చేపట్టింది. అయితే, అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది.

అయితే, ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నారు. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించింది.
గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించగా.. ఈ సారి మాత్రం ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..