AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ షాక్..! పేమెంట్ ఛార్జీలపై కేంద్రం సంచలన నిర్ణయం..?

మన దేశంలో టీ కొట్టు దగ్గరి నుంచి షాపింగ్ మాల్స్ వరకు.. జేబులో రూపాయి లేకపోయినా యూపీఐ ఉంటే చాలు పని జరిగిపోతుంది. అంతలా మన జీవితాల్లో భాగమైన యూపీఐ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై రూ.2000 దాటితే యూపీఐ లావాదేవీలపై ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమవుతుంది.

ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ షాక్..! పేమెంట్ ఛార్జీలపై కేంద్రం సంచలన నిర్ణయం..?
Upi Payments
Krishna S
|

Updated on: Jul 18, 2026 | 4:33 PM

Share

మన దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యుపీఐ పేమెంట్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. దేశవ్యాప్తంగా రోజువారీ లావాదేవీల్లో భాగమైపోయిన యూపీఐపై మర్చంట్ ఫీజును తిరిగి తీసుకురావాలనే ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ ప్రతిపాదన గనుక పట్టాలెక్కితే, దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఇది ఒక అతిపెద్ద మార్పుగా నిలవనుంది. పెద్ద కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యాపార రంగానికి జరిగే యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించేందుకు కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపైనే ఈ ఫీజు వర్తించే అవకాశం ఉంది. ఈ మర్చంట్ ఫీజు 0.5 శాతం కంటే తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనపై రాబోయే రెండు వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.

వినియోగదారులపై భారం..?

సాధారణ ప్రజలకు లేదా నిత్యావసరాలు కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ ఫీజుతో ఎలాంటి సంబంధం ఉండదు. నిధుల బదిలీ లేదా షాపింగ్ కోసం యూపీఐ వాడే వినియోగదారుల నుండి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఫీజు కేవలం పెద్ద వ్యాపారుల నుండి మాత్రమే వసూలు చేస్తారు.

ఎందుకు ఈ మార్పు? పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు! యూపీఐ లావాదేవీలు దేశంలో ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. అయితే ఈ రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్లను సజావుగా ప్రాసెస్ చేయడానికి బ్యాంకులు, ఇతర పేమెంట్ యాప్స్ భారీగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రూ.2,000 లోపు ఉండే తక్కువ విలువ గల యూపీఐ లావాదేవీలు, రూపే డెబిట్ కార్డ్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు ఇన్సెంటివ్‌లను అందిస్తోంది. కానీ రోజురోజుకూ పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల దృష్ట్యా, ఈ వ్యవస్థ భవిష్యత్తులో కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఫీజులు తప్పవని నిపుణులు భావిస్తున్నారు.

స్టాండింగ్ కమిటీ నివేదిక..

ఆర్థిక శాఖకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ ఇటీవల సమర్పించిన నివేదికలో కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రారంభంలో జీరో ఎండీఆర్ ప్రవేశపెట్టినప్పటికీ.. దానివల్ల ప్రస్తుతం యూపీఐ ఎకోసిస్టమ్ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని కమిటీ హెచ్చరించింది. వచ్చే ఐదు నుండి ఏడేళ్లలో యూపీఐ వ్యవస్థ మరో 60 కోట్ల మంది కొత్త వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. నెలకు దాదాపు 100 నుండి 150 బిలియన్ల లావాదేవీలు జరిగే ఛాన్స్ ఉంది. ఇంత భారీ నెట్‌వర్క్‌ను తట్టుకోవాలంటే భద్రత, మౌలిక సదుపాయాల పటిష్టత కోసం నిధుల లభ్యత అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే పెద్ద వ్యాపార లావాదేవీలపై ఫీజుల విధింపు వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.

Follow Us