Central Government: పేదల కోసం కేంద్రం సూపర్ స్కీమ్.. అత్యంత చవక ధరకే మెడిసిన్స్.. ఎక్కడైనా తీసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం జన ఔషది కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కేంద్రాల్లో తక్కువ ఖర్చుతో మెడిసన్స్ కొనుగోలు చేయవచ్చు. జనరిక్ మందులను ఇక్కడ కొనవచ్చు. పేదలకు తక్కువ ధరలకు మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం ఇవి తీసుకొచ్చింది.

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్ర యోజన (పీఎంబీజేపీ) కింద దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దేశంలోని 784 జిల్లాలకు గాను 776 జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. దాదాపు అన్ని జెనరిక్ మందులు ఈ కేంద్రాల్లో తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నారు. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జన ఔషధి కేంద్రాల్లో అతి తక్కువ ధరకు మెడిసిన్స్ లభిస్తాయి. 2,110 రకాల మందులతో పాటు 315 రకాల సర్జికల్ వస్తువులు, వైద్య వినియోగ వస్తువులు,పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ఈ కేంద్రాన్ని తెరవడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.
ఒకేసారి రూ.2 లక్షల ప్రోత్సాహం
ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ప్రారంభించేందుకు ఒకేసారి రూ.2 లక్షల ప్రోత్సాహం కేంద్ర అందిస్తోంది. అలాగే కేంద్రం తక్కువ ధరలకే మందులను కూడా అందిస్తుంది. ఈ కేంద్రం ఏర్పాటు చేసుకుంటే మందుల అమ్మకాలపై 20 శాతం కమీషన్, ఎక్కువ విక్రయిస్తే ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. ఏ వ్యక్తి అయినా, ఆసుపత్రి అయినా, స్వచ్ఛంద సంస్థ అయినా, లేదా ఫార్మసిస్ట్ అయినా జన ఔషధి కేంద్రాన్ని తెరవవచ్చు. ఫర్నిచర్, కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.2 లక్షలు అందిస్తోంది. ఈ కేంద్రాన్ని తెరవడానికి మీకు కనీసం 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. మీరు స్థలాన్ని అద్దెకు కూడా తీసుకోవచ్చు. అదనంగా మీకు తప్పనిసరిగా ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. జన ఔషధి కేంద్రం ఆమోదం పొందిన తర్వాత ఫార్మసిస్ట్ పేరు, రిజిస్ట్రేషన్ వివరాలను అందించాలి.
దరఖాస్తు ఫీజు ఎంతంటే..?
మహిళా పారిశ్రామికవేత్త, మాజీ సైనికుడు, దివ్యాంగులు, ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందినవారు ఆకాంక్షిత జిల్లాలు, హిమాలయ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాలు, లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారైతే ఒక సర్టిఫికేట్, అండర్టేకింగ్ సమర్పించాలి. దరఖాస్తు ఫీజు రూ.5 వేలు ఉంటుంది. మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులు, ఎస్సీ/ఎస్టీ వ్యక్తులు, మాజీ సైనికులు, మరియు నీతి ఆయోగ్ గుర్తించిన ఆకాంక్షిత జిల్లాలు, హిమాలయ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాలు, మరియు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ఈ రుసుము చెల్లించకుండానే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలని లేదా మెడికల్ షాప్ పెట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. మీ వ్యాపారాన్ని కావాల్సిన సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి పొందవచ్చు.
