తెలియకుండానే నకిలీ ట్రేడింగ్ యాప్స్ వాడుతున్నారా? SEBI కీలక నిర్ణయం
నకిలీ ట్రేడింగ్ యాప్లు, మోసపూరిత ఆర్థిక ప్రకటనల బెడదను అరికట్టేందుకు SEBI కీలక చర్యలు చేపట్టింది. గూగుల్తో కలిసి, ప్లే స్టోర్లో SEBI-రిజిస్టర్డ్ యాప్లకు 'వెరిఫైడ్' టిక్ గుర్తు ఇవ్వనుంది. అలాగే, సోషల్ మీడియాలో ఆర్థిక ప్రకటనలకు రిజిస్టర్డ్ సంస్థలకే అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది.

డిజిటల్ యుగంలో పెట్టుబడులు పెట్టడం ఎంత సులభమైందో, అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. ముఖ్యంగా నకిలీ ట్రేడింగ్ యాప్ల బెడద పెట్టుబడిదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో SEBI కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుని, వినియోగదారుల భద్రత కోసం కొత్త వెరిఫికేషన్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో SEBI వద్ద రిజిస్టర్ అయిన ట్రేడింగ్ యాప్లకు గూగుల్ ప్లే స్టోర్లో వెరిఫైడ్ అనే టిక్ గుర్తు ఇవ్వనుంది. నకిలీ యాప్లు అసలు యాప్ల రూపాన్ని కాపీ చేసి వినియోగదారులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ గుర్తింపు వ్యవస్థ వినియోగదారులకు నిజమైన, నకిలీ యాప్ల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది.
ఇక ప్రకటనల విషయంలో కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు SEBI సిద్ధమవుతోంది. ముఖ్యంగా మెటా ప్లాట్ఫామ్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఆర్థిక ప్రకటనలు ఇవ్వడానికి SEBIలో నమోదైన సంస్థలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ చర్య ద్వారా మోసపూరిత ఆర్థిక సలహాలు ఇచ్చే అనధికారిక ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రించాలనేది లక్ష్యం. SEBI అధికారుల ప్రకారం ఈ మోసాలకు కేవలం సాధారణ వినియోగదారులే కాకుండా, వైద్యులు, ప్రొఫెసర్లు వంటి చదువుకున్నవారు కూడా బలవుతున్నారు. అందుకే యాప్ను డౌన్లోడ్ చేసే ముందు ధృవీకరణ లేబుల్ ఉందో లేదో చూసుకోవడం అత్యంత అవసరం.
పెట్టుబడిదారులు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని SEBI సూచిస్తోంది. ముఖ్యంగా యాప్ వెరిఫైడ్ అయిందో లేదో చూడటం, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను నిర్లక్ష్యంగా పంచుకోకపోవడం, అలాగే డబ్బు పంపే ముందు UPI లేదా బ్యాంక్ వివరాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడం అవసరం. మొత్తంగా ఈ కొత్త చర్యలు పెట్టుబడిదారుల భద్రతను పెంచడంలో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే నకిలీ యాప్లను పూర్తిగా అరికట్టడానికి వినియోగదారుల అప్రమత్తత కూడా అంతే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
