Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయా..? వాహనదారులకు షాక్..!
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు క్రిసిల్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఇంధన ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయా..? త్వరలోనే మళ్లీ వాహనదారులకు షాక్ తప్పదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇంధన ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో మరింత పెరుగుదల ఉండొచ్చని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. క్రిసిల్ నివేదిక కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది. ముడి చమురు ధరలు తగ్గకపోతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగొచ్చని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది.
లీటర్కు రూ.10 పెరుగుతుందా..?
భవిష్యత్తులో పెంపు అనేది లీటర్పై రూ.10 వరకు చేరుకోవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. మే 15వ తేదీ నుంచి పెరుగుదల నమోదవ్వగా.. ఇప్పటివరకు రూ.7.5 మేర పెరిగాయి. దీంతో మరో రూ.2.5 పెరిగితే మొత్తం పెరుగుదల రూ.10కి చేరుతుంది. ఇదే జరిగితే దేశంలో నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఇంధన ధరలు లీటర్కు రూ.7.5 పెరగడం వల్ల వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 36 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. అదే రూ.10 వరకు పెరిగితే 48 బేసిస్ పాయింట్లకు చేరుకుంటుందని అంచనా. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీని వల్ల ఆహార ధరలు కూడా పెరిగే అవకాశముంటుంది.
ఏయే వస్తువులు పెరుగుతాయంటే..?
పాల ఉత్పత్తులు, టీ, కాఫీ, పండ్లు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, గుడ్లు, మాంసం, చేపల ధరలు పెరుగుతాయి. ఇంధనం, రవాణా ఖర్చులు పెరుగుదల వల్ల వాటి ధరలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ఇక దుస్తులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, కలప ఉత్పత్తులు, గృహ నిర్మాణ సామగ్రి అయిన సిమెంట్, సిరామిక్స్ వంటి వస్తువుల ధరలు పెరుగుతాయి.
