Digital Scam: ఒకే ఒక్క ఫోన్ కాల్.. 54 రోజులు నిర్బంధంలో.. బెదిరింపులతో రూ.40 లక్షల టోకరా..!
Digital Scam: ఒకే ఒక్క ఫోన్ కాల్.. అతని నిర్బంధంలో నెట్టేసింది. అంతేకాదు ఫోన్ కాల్ ద్వారానే బెదిరింపులకు పాల్పడుతూ ఆ వ్యక్తి నుంచి ఏకంగా 40 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Digital Scam: ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు భయంకరంగా మోసం చేశారు. అతనికి ఫోన్ చేసి తాము ATS (Anti-Terrorism Squad), NIA (National Investigation Agency) అధికారులమని నమ్మించి, దాదాపు రెండు నెలల పాటు అతడిని మానసికంగా వేధించి భారీ మొత్తాన్ని దోచుకున్నారు.
ఏం జరిగింది?
మొదటి ఫోన్ కాల్: బాధితుడికి ఒక గుర్తు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. అతని పేరు మీద ఒక పార్శిల్ ఉందనీ, అందులో డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్లు ఉన్నాయని కేటుగాళ్లు భయపెట్టారు. అతనికి స్కైప్ (Skype) కాల్ చేసి, తాము పెద్ద ఇన్వెస్టిగేషన్ అధికారులమని నమ్మించారు. కేసు విచారణలో ఉన్నందున ఎవరికీ చెప్పకూడదని, గది నుండి బయటకు రాకూడదని ఆదేశించారు. దీనినే ‘డిజిటల్ అరెస్ట్’ అని పిలుస్తారు. 54 రోజుల నరకం.. బాధితుడిని ఏకంగా 54 రోజుల పాటు వీడియో కాల్ ద్వారా నిరంతరం నిఘాలో ఉంచారు. అతను బయట ఎవరితోనూ మాట్లాడకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేశారు.
డబ్బు వసూలు: కేసు నుండి బయటపడాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బు చెల్లించాలని కోరారు. భయపడిపోయిన బాధితుడు విడతల వారీగా మొత్తం రూ.40 లక్షలను నిందితులు చెప్పిన వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు.
ఇది కూడా చదవండి: RBI: రద్దు చేసిన రూ.2,000 నోట్లు ఏమయ్యాయి? ఆర్బీఐ వాటిని ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
నిజం ఎలా తెలిసింది?
చాలా రోజుల తర్వాత నిందితుల ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితుడు, తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. ఇది మోసమని గ్రహించిన బాధితుడు వెంటనే ముంబై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి?
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండటానికి ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోండి:
పోలీసులు ఫోన్లో అరెస్ట్ చేయరు: భారతదేశంలోని ఏ చట్ట అమలు సంస్థ (CBI, Police, ED, NIA) కూడా వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయదు లేదా విచారణ జరపదు. అలాగే ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ ఫోన్ కాల్స్లో సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బు అడగరు. గుర్తు తెలియని వ్యక్తులు స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్స్ చేసి అధికారులమని చెబితే నమ్మకండి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే కాల్ కట్ చేసి, మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు. మీరు మోసపోయారని అనిపిస్తే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PPF: నెలకు రూ.12,500 పెట్టుబడితో చేతికి రూ. 66 లక్షలు.. ఎలాగో తెలుసుకోండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




