గ్యాస్ కష్టాలకు చెక్.. LPG బుకింగ్ డేస్ లిమిట్ తగ్గింపు! ఎన్ని రోజులంటే?
ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 26 రోజులకు పెంచింది. ముఖ్యంగా బెంగళూరులో గ్యాస్ కొరత, రీఫిల్ ఆలస్యం తీవ్రం కావడంతో ఈ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చారు. వినియోగదారులు 'రీఫిల్ నాట్ అలౌడ్' వంటి సమస్యలు ఎదుర్కొంటుండగా, కర్ణాటక మంత్రులు కేంద్రం జోక్యం కోరారు.

ఎల్పీజీ కొరత నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 26 రోజులకు పెంచుతూ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా బెంగళూరులో గ్యాస్ కొరత, ఆటో ఎల్పిజి క్యూలు పెరగడం, రీఫిల్లలో ఆలస్యం వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. 14.2 కిలోలతో పాటు 10 కిలోల, 5 కిలోల గృహ సిలిండర్లను తిరిగి బుక్ చేసుకోవాలంటే కనీసం 26 రోజుల వ్యవధి తప్పనిసరి. ముఖ్యంగా ఈ కాలాన్ని బుకింగ్ తేదీ నుంచి కాకుండా, సిలిండర్ డెలివరీ సమయంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన సమయం నుంచి లెక్కించడం వినియోగదారులకు కొత్తగా అనిపిస్తోంది.
దీంతో చాలా మంది వినియోగదారులు బుకింగ్ సమయంలో రీఫిల్ నాట్ అలౌడ్ లేదా టెక్నికల్ ఎర్రర్ వంటి సందేశాలను ఎదుర్కొంటున్నారు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా మాత్రం డిమాండ్, లభ్యత ఆధారంగా కొనసాగుతుంది. హోటళ్లు, వ్యాపార సంస్థలకు కొంతవరకు సరఫరా మెరుగుపడుతున్నప్పటికీ, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్పిజి బంక్ల వద్ద భారీ క్యూలు, కొన్ని చోట్ల తాత్కాలిక మూసివేతలు కూడా నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితిపై కర్ణాటక మంత్రులు కృష్ణ బైరే గౌడ, దినేష్ గౌడ రావు కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరారు. గ్యాస్ కొరతపై ఇప్పటికే న్యూఢిల్లీకి పలు నివేదికలు పంపినప్పటికీ, స్పష్టమైన స్పందన రాలేదని తెలిపారు. ఇక హవేరిలో గ్యాస్ ఏజెన్సీ వద్ద జరిగిన గొడవ హింసాత్మకంగా మారి ఇద్దరు గాయపడిన ఘటన పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. మొత్తం మీద సరఫరాను క్రమబద్ధీకరించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం తాత్కాలిక ఇబ్బందులు కలిగించినప్పటికీ, డిమాండ్-సప్లై సమతుల్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
