New Rules: జులై నుంచి మారనున్న రూల్స్.. ఈ తప్పులు చేస్తే రూ.5 వేల ఫైన్.. అమల్లోకి రానున్న నిబంధనలు ఇవే..
జులై నెల మరో నాలుగు రోజుల్లో రాబోతుంది. దీంతో సామాన్యులను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. రైల్వే జరిమానాల నుంచి గ్యాస్ సిలిండర్లు, క్రెడిట్ కార్డ్స్ వరకు అనేక కొత్త రూల్స్ రాబోతున్నాయి. వీటి గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోండి.

జులై 1వ తేదీ వచ్చేస్తోంది. మరో నాలుగు రోజుల్లో కొత్త నెల రాబోతుంది. కొత్త నెల వస్తుందంటే చాలు.. ప్రజలను అర్ధికంగా ప్రభావితం చేసే అనే మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. జులై నుంచి ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సామాన్యులపై ఇవి మరింత ప్రభావం చూపించనున్నాయి. వీటి గురించి దేశ ప్రజలందరూ అవగాహన కలిగి ఉండటం అనేది ముఖ్యం. దీని వల్ల సేవలు పొందంటంలో ఇబ్బందులు ఉండవు. జులై 1 నుంచి రానున్న కొత్త మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రైల్వే ఉల్లంఘనలకు భారీ జరిమానా
జులై 1వ తేదీ నుంచి రైల్వే ఉల్లంఘనలకు పాల్పడేవారికి భారీగా జరిమానాలు విధించనున్నారు. గతంలో విధించే ఫైన్లను రైల్వేశాఖ మరింత పెంచింది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే గతంలో కనీస ఫైన్ రూ.250 ఉండగా.. ఇప్పుడు రూ.500కి పెంచారు. మహిళల ప్రత్యేక కోచ్లో పురుషులు ప్రయాణిస్తే రూ.2500 జరిమానా విధిస్తారు. ఇతరుల టికెట్పై ప్రయాణించడం, జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ లేదా ఏసీ కోచ్లో వెళ్లడం, రైళ్లలో నిషేధిత వస్తువుల తీసుకెళ్లడం, అనుమతి లేకుండా రైళ్లల్లో విక్రయించడం, మద్యం సేవించడం, బిక్షాటన చేయడం వంటి ఉల్లంఘనలకు రూ.5 వేల వరకు జరిమానా విధిస్తారు.
మారనున్న గ్యాస్ ధరలు
ప్రతీ నెలా ఒకటో తేదీన కొత్త గ్యాస్ ధరలు విడుదల అవుతాయి. ఒకటో తేదీ కంపెనీలు గ్యాస్ ధరల్లో సవరణలు చేస్తూ ఉంటాయి. జూన్ 1న డొమెస్టిక్ గ్యాస్ ధరలను రూ.30 మేర పెంచారు. దీంతో జులై 1న ధరలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయంగా పరిస్థితులు సద్దుమణగడంతో ధరలు తగ్గిస్తారా.. లేదా పెంచుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. దీంతో జులై 1 కోసం ఎదురుచూస్తున్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కు గడువు
2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్1, ఐటీఆర్ 2 దాఖలుకు జులై 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి టీడీఎస్ డిపాజిట్కు జులై 7 వరకు మాత్రమే టైమ్ ఉంది.
క్రెడిట్ కార్డు రూల్స్లో మార్పులు
జులైలో పలు బ్యాంకులు క్రెడిట్ కార్డు నియమాల్లో మార్పులు అమల్లోకి తీసుకురానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించేవారు దేశీయ విమానాల్లో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే గడిచిన సంవత్సరంలో రూ.60 వేలు ఖర్చు చేయాలి. ఇక యస్ బ్యాంక్ కార్డుదారులు లాంజ్ యాక్సెస్ పొందేందుకు ఖర్చు చేయాల్సిన సొమ్మును రూ.10 నుంచి రూ.30కు పెంచారు. జులై 15లోగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు యాక్సిస్ బ్యాంక్కు మైగ్రేట్ కానున్నాయి. ఇక హెచ్ఎస్బీసీ ఇన్యూరెన్స్ ప్రీమియం, యుటిలిటీ బిల్లులు, వాలెట్ లోడ్స్, ప్రభుత్వం చెల్లింపులపై రివార్డు పాయింట్లను జులై నుంచి నిలిపివేయనుంది.
