డేంజర్ బెల్స్.. యుద్ధ కారణంగా ఇండియాలో వీటి ధరలు పెరిగే ఛాన్స్?
మధ్యప్రాచ్యంలోని ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరలు భారీగా పెరిగి, బ్యారెల్కు 90 డాలర్ల కి చేరాయి. దీనివల్ల భారత్లో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి, సామాన్య భారతీయుల రోజువారీ ఖర్చులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం త్వరలోనే సాధారణ భారతీయుల రోజువారీ ఖర్చులపై కూడా కనిపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధం ప్రారంభానికి ముందు బ్యారెల్కు సుమారు 62 డాలర్లు ఉన్న ముడి చమురు ధరలు కేవలం ఒక వారంలోనే భారీగా పెరిగాయి. అమెరికా ముడి చమురు WTI ధర 36 శాతం పెరిగి 90.90 డాలర్లకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణించే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా బ్యారెల్కు 92.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది సుమారు 27 శాతం పెరుగుదలగా భావిస్తున్నారు. ఈ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగబోతుందనే సంకేతాలను ఇస్తోంది.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన ఉద్రిక్తత. ప్రపంచ చమురులో దాదాపు 20 నుంచి 25 శాతం వరకు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇరాన్ ఈ ప్రాంతానికి సమీపంలో ఉండటం వల్ల యుద్ధ పరిస్థితుల్లో సరఫరా అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. దీంతో నౌకా రవాణా సంస్థలు, కార్గో కంపెనీలు అధిక బీమా ప్రీమియంలు చెల్లించాల్సి వస్తోంది. ఈ అదనపు ఖర్చులు చివరకు ముడి చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. భారతదేశానికి ఈ పరిస్థితి మరింత సవాలుగా మారవచ్చు.
ఎందుకంటే దేశం తన ముడి చమురు అవసరాలలో సుమారు 30 నుంచి 50 శాతం వరకు మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. భారత రిఫైనరీలలో ఎక్కువ భాగం కూడా అదే ప్రాంతం నుంచి వచ్చే చమురును ప్రాసెస్ చేయడానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. అందువల్ల అక్కడి ఉద్రిక్తతలు కొనసాగితే సరఫరా, ధరలపై ప్రభావం తప్పదని నిపుణులు అంటున్నారు. అయితే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారతదేశం దగ్గర 25 నుంచి 30 రోజుల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. ఇవి తాత్కాలిక సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. కానీ యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే దేశంలో ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, చివరకు రోజువారీ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
