India Bans Wheat Export: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ ఉత్తర్వులు

India Bans Wheat Export: దేశంలో గోధుమల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమల..

India Bans Wheat Export: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ ఉత్తర్వులు
Follow us

|

Updated on: May 14, 2022 | 11:03 AM

India Bans Wheat Export: దేశంలో గోధుమల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విదేశీ ప్రభుత్వాలతో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఆధారంగా మే 13 నాటికి చేసుకున్న ఒప్పందాల మేరకు మాత్రం దిగుమతులు కొనసాగుతాయని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (DGFT) తెలిపింది. ఇతర దేశాల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు ఎగుమతులను అనుమతించింది. దీనికి భారత ప్రభుత్వం అనుమతి తప్పకుండా ఉండాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో గోధుమ ధరలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.

ఎందుకు ఈ నిషేధం..

రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 7.79 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.38 శాతంగా ఉంది. ప్రపంచంలోనే గోధుమల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలను ఎదుర్కొంటోంది. గ్లోబల్ మార్కెట్‌లో గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఉక్రెయిన్ – రష్యా సంక్షోభం కారణంగా నల్ల సముద్రం మార్గం ద్వారా గోధుమ రవాణా బాగా ప్రభావితమైంది. అటువంటి పరిస్థితిలో భారతదేశం నుండి డిమాండ్ పెరిగింది. ఎగుమతులు కూడా పుంజుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 70 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత భారతదేశం నుండి ఎగుమతి చేయబడిన గోధుమలు మరింతగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

 ప్రపంచ మార్కెట్‌లో గోధుమ ధర 40 శాతం పెరిగింది

రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా, భారతదేశం నుండి గోధుమ ఎగుమతి, డిమాండ్ రెండింటిలో డిమాండ్‌ పెరిగింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే భారత్ రికార్డు స్థాయిలో 14 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. డిమాండ్ కంటే తక్కువ సరఫరా కారణంగా, ప్రపంచ మార్కెట్‌లో గోధుమ ధర 40 శాతం వరకు పెరిగింది. దేశీయ మార్కెట్‌లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది.

గోధుమ ద్రవ్యోల్బణం 63 నెలల గరిష్టానికి చేరుకుంది. భారతదేశ టోకు గోధుమ ద్రవ్యోల్బణం మార్చిలో 14 శాతంగా ఉంది. ఇది 63 నెలల గరిష్ట స్థాయి. అంతకుముందు డిసెంబర్ 2016లో, టోకు గోధుమ ద్రవ్యోల్బణం రేటు దీని కంటే ఎక్కువగా ఉంది. ఐదేళ్ల రికార్డు ఉత్పత్తి తర్వాత, భారతదేశంలో గోధుమ ఉత్పత్తి ఈ సంవత్సరం తగ్గుతుందని అంచనా వేయబడింది. జూన్‌తో ముగిసే పంట సంవత్సరానికి ప్రభుత్వం గతంలో గోధుమ ఉత్పత్తి 111.32 మెట్రిక్ టన్నులుగా అంచనా వేసింది. ఇప్పుడు అది 5.7% తగ్గి 105 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది కాకుండా, గోధుమల ప్రభుత్వ సేకరణ లక్ష్యాన్ని కూడా సగానికి తగ్గించవచ్చు. ఉత్తర, పశ్చిమ భారతదేశంలో వేడి కారణంగా గోధుమ పంటకు భారీ నష్టం జరిగింది.

పిండి ధరలు కూడా పెరుగుతాయి

డిమాండ్ పెరగడం వల్ల గోధుమ ధరలు ఈ సంవత్సరం కనీస మద్దతు ధర (MSP) కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రైతులు ప్రభుత్వ సేకరణ ఏజెన్సీల వద్ద గోధుమలను విక్రయించకుండా నేరుగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గోధుమల ఎగుమతికి మంచి అవకాశాలు ఉండడంతో వ్యాపారులు నేరుగా రైతుల నుంచి గోధుమలను కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో, భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే భయంతో పిండి మిల్లర్లు చాలా గోధుమలను నిల్వ చేశారు.

10 మిలియన్ టన్నుల ఎగుమతి లక్ష్యంగా..

గోధుమలు ఉత్పత్తి చేసే సమయంలో విపరీతమైన వేడి కారణంగా ఈ ఏడాది దిగుబడి 15-20% తగ్గే అవకాశం ఉంది. వాస్తవానికి రష్యా- ఉక్రెయిన్‌లను గోధుమ కోట అని పిలుస్తారు. మునుపటి సంవత్సరాల వరకు రెండు దేశాలు ప్రపంచంలోని చాలా దేశాల గోధుమ అవసరాలను తీర్చేవి. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. 2022-23లో గ్లోబల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రికార్డు స్థాయిలో 10 మిలియన్ టన్నుల గోధుమలను ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి