India Post: స్పీడ్ పోస్ట్ పంపిస్తున్నారా..? ఆగస్ట్ 1 నుంచి కొత్త ఛార్జీలు.. వేటికి ఎంతంటే..?
పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ఛార్జీలలో మార్పులు చేసింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. అలాగే డాక్యుమెంట్స్గా వేటిని పరిగణిస్తారు.. పార్శిల్స్గా వేటిని పరిగణిస్తారు అనే దానిపై స్పష్టత ఇచ్చింది.

పోస్టాఫీస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. స్పీడ్ పోస్ట్ ఛార్జీలు మారాయి. ఆగస్ట్ 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 24 గంటలు, 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు పోస్టల్ శాఖ విడుదల చేసింది. సాధారణ వినియోగదారులకు ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ.. బల్క్ వినియోగదారులకు కొత్త రేట్లను ప్రవేశపెట్టింది. అలాగే డాక్యుమెంట్స్ కేటగిరీలో దేనిని పరిగణిస్తారు.. ? పార్శిల్గా దేనిని పరిగణిస్తారు? అనే విషయాలపై స్పష్టత ఇచ్చింది. దీని వల్ల అధిక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టల్ శాఖ విడుదల చేసిన కొత్త గైడ్లైన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం.
ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎలాంటి వాణిజ్య విలువ లేని వస్తువులను పత్రాలుగా పరిగణిస్తారు. ఉత్తరాలు, ముద్రిత సామాగ్రి, అధికారిక పత్రాలు, వెల్కమ్ కిట్లు, పాస్ బుక్లు, బ్యాంక్ స్టేట్మెంట్స్, డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకులు పంపే ఇతర సమాచారాల డాక్యుమెంట్స్ వంటివి ఈ కేటగిరీలో ఉంటాయి. ఇక ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్లు, ఓటర్ ఐడి కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లతో సహా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు పత్రాలు కూడా ఈ వర్గం కిందకు వస్తాయి. 500 గ్రాముల వరకు బరువున్న వాణిజ్యేతర ఎన్వలప్లు లేదా ప్యాకెట్లను డాక్యుమెంట్ల కేటగిరీలో పంపవచ్చని ఇండియా పోస్ట్ స్పష్టం చేసింది. గ్రీటింగ్ కార్డులు, రాఖీ ఎన్వలప్లు, ఇతర వ్యక్తిగత వాణిజ్యేతర ఉత్తర ప్రత్యుత్తరాల వంటివి డాక్యుమెంట్ల కేటగిరీలో ఉంటాయి.
అయితే వాణిజ్య విలువ కలిగిన ఏ వస్తువునైనా లేదా అమ్మకానికి ఉద్దేశించిన ఉత్పత్తులను లేదా సరుకులను ఇకపై పార్శిల్గా పరిగణిస్తారు. రిటైల్ వినియోగదారులకు ప్రస్తుత స్పీడ్ పోస్ట్ టారిఫ్లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. కొత్త 24 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీస్ కింద 50 గ్రాముల వరకు బరువున్న పత్రాలను పంపే వినియోగదారులు స్థానిక డెలివరీకి రూ. 38, దేశంలోని ఇతర ప్రాంతాలకు డెలివరీల కోసం రూ. 94 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. రవాణా చేసే వస్తువుల బరువు, గమ్యస్థానాన్ని బట్టి ఛార్జీలు పెరుగుతాయి. 51-250 గ్రాముల బరువున్న పత్రాలకు రూ. 118 నుండి రూ. 154 వరకు ఛార్జీలు వర్తిస్తాయి, అయితే 251-500 గ్రాముల బరువున్న వాటికి రూ. 140 నుండి రూ. 186 వరకు ఖర్చవుతుంది. అధిక పరిమాణంలో మెయిల్ పంపే సంస్థల కోసం ఇండియా పోస్ట్ ప్రత్యేక బల్క్ ధరలను ప్రకటించింది. 24 గంటల స్పీడ్ పోస్ట్ సేవను ఉపయోగించే బల్క్ కస్టమర్లు కేటగిరీ , గమ్యస్థానాన్ని బట్టి రూ. 38 నుండి రూ. 100 వరకు చెల్లిస్తారు. 48-గంటల స్పీడ్ పోస్ట్ సేవకు రూ. 48 నుండి రూ. 72 వరకు ఖర్చవుతుంది. 48 గంటల స్పీడ్ పోస్ట్ సేవను ఉపయోగించే రిటైల్ కస్టమర్లు బరువు, డెలివరీ ప్రదేశాన్ని బట్టి రూ. 61 నుండి రూ. 121 వరకు చెల్లిస్తారు.
