పసిడి, వెండి ప్రియులకు బిగ్ షాక్! సుంకాలు భారీగా పెంచేసిన కేంద్ర ప్రభుత్వం
కేంద్రం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వల ఒత్తిడి తగ్గించడం, రూపాయికి మద్దతు ఇవ్వడమే లక్ష్యం. ఈ పెంపుతో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. జ్యువెలరీ పరిశ్రమ స్మగ్లింగ్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భారత్లో బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు గాను బంగారం, వెండి దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు బుధవారం (మే 13, 2026) ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచారు. ఇందులో 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు 5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (AIDC) ఉంటుంది. ఈ పెంపు కారణంగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేవలం బంగారం, వెండి మాత్రమే కాకుండా ప్లాటినం, అలాగే ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, పిన్స్, స్క్రూ బ్యాక్స్ వంటి విడిభాగాలపై కూడా కొత్త పన్ను రేట్లు వర్తించనున్నాయి. దీంతో జువెలరీ తయారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశం. దేశంలో వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం సుమారు 71 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో విదేశీ మారక నిల్వలపై భారీ ఒత్తిడి పడుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ బలహీనపడటం వంటి కారణాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దిగుమతులను తగ్గించడం ద్వారా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ను నియంత్రించడం, రూపాయికి మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయ లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై జువెలరీ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారీగా డ్యూటీలు పెంచడం వల్ల అక్రమ రవాణా మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్న సమయంలో స్మగ్లింగ్ పెరిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.
ఇక సామాన్య వినియోగదారులపై కూడా దీని ప్రభావం పడనుంది. పెళ్లిళ్లు, పండుగల సీజన్కు ముందు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త ధరలు మరింత భారం కావచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు, సావరిన్ గోల్డ్ బాండ్ల వంటి ప్రత్యామ్నాయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
